Ghani: రాజకీయాల పరంగా వైసీపీ వర్సెస్ జనసేన అన్న తరహాలో వాతావరణం ఉంటుందన్న సంగతి తెలిసిందే. సో మెగా అభిమానులు చాలా వరకు వైసీపీ పార్టీ అంటే వ్యతిరేక భావం చూపే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. ఇటువంటి తరుణంలో మెగా బ్రదర్ నాగబాబు కూడా జనసేన పార్టీలో కీలక బాధ్యతలు వహిస్తున్నారు. కాగా తాజాగా మెగా బ్రదర్ నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ నటించిన “గని” ప్రీ రిలీజ్ వేడుక విశాఖపట్నం లో జరిగింది. ఈ వేడుకకు వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మెగా కుటుంబంతో తనకున్న అనుబంధం గురించి వివరించారు.
మెగా బ్రదర్ నాగబాబు తనకు అన్నలాంటి వాడని.. అటువంటి నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ మరింతగా సినిమాలో రాణించాలని కోరారు. అంతమాత్రమే కాదు ఒకప్పుడు చిరంజీవి.. అల్లు రామలింగయ్య ఉన్న సమయంలో తెలుగుకే పరిమితమయ్యారు. ప్రస్తుతం టెక్నాలజీ పరంగా తెలుగు ఇండస్ట్రీ విస్తరించింది. పాన్ ఇండియా స్థాయిలో… వరుణ్ తేజ్ మంచి పేరు సంపాదించుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆల్రెడీ ఈ దిశగా “పుష్ప”తో అల్లుఅర్జున్ ఇండియా ని షేక్ చేశాడని… పొగడ్తలతో ముంచెత్తారు.
అంతమాత్రమే కాదు వైజాగ్ కి గీత ఆర్ట్స్ బ్యానర్ కి విడదీయరాని బంధం ఉంది. మొన్న వచ్చిన “అలా వైకుంఠపురం లో” ప్రీ రిలీజ్ వేడుక కూడా ఇక్కడే జరిగింది. సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. “గని” కూడా అదే రీతిలో విజయం సాధిస్తుందని అవంతి శ్రీనివాస్ ఆకాంక్షించారు. అదే విధంగా విశాఖ పట్టణంలో యాక్టింగ్ స్కూల్ పెడితే బాగుంటుందని అల్లు అరవింద్ కి సూచించారు. స్వర్గీయ అల్లు రామలింగయ్య పేరిట రాజమండ్రిలో హోమియోపతి మెడికల్ కళాశాల నిర్మించారు. ఇప్పుడు ఇదే రీతిలో విశాఖపట్టణంలో యాక్టింగ్ స్కూల్ నిర్మించాలని.. ప్రభుత్వం పూర్తిగా సపోర్ట్ చేస్తుందని తెలియజేశారు. “గని” సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్పూర్తిగా కోరుతున్నాం అని.. విశాఖపట్నాన్ని అభివృద్ధి చెందడానికి సీఎం జగన్ అన్ని రకాలుగా కృషి చేస్తున్నారని.. ఇండస్ట్రీ పెడితే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలియజేశారు.