సినిమాల్లో రాణించడం వేరు.. ఉన్నతస్థాయికి ఎదగడం వేరు. ఇందులో ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోవడం.. పరిశ్రమలో ఉన్నత వ్యక్తిగా ఎదగడం మరొక ఎత్తు. తెలుగు సినీ పరిశ్రమలో ఈ రెండో కేటగిరీకి చెందిన వ్యక్తి ‘మంచు మోహన్ బాబు’. విలక్షణ నటుడిగా ప్రేక్షకులతో, కలెక్షన్ కింగ్ గా అభిమానులు, ట్రేడ్ తో పిలిపించుకున్న నట శిఖరం ఆయన. విలన్, క్యారెక్టర్ నటుడు, హీరో, నిర్మాత, విద్యా సంస్థల అధినేత.. ఇలా మోహన్ బాబు రాణిస్తున్నారు. 1975 నవంబర్ 22న ‘స్వర్గం నరకం’ సినిమాతో తొలి అడుగులు వేసిన మోహన్ బాబు కెరీర్ కు నేటితో 45 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
గురువు దాసరి నారాయణరావు మార్గ నిర్దేశకత్వంలో నటనలో రాటుదేలారు. డిఫరెంట్ మాడ్యులేషన్ తో ఆయన చెప్పిన డైలాగులకు డైలాగ్ కింగ్ అయ్యారు. నటనలో ఆయన చూపిన వైవిధ్యం.. ఏకంగా 565పైగా సినిమాలు చేసేలా చేసింది. మాస్ హీరో, ఫ్యామిలీ హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఇలా ఎన్నో పాత్రల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు. దేవత, కొదమసింహం, వారసుడొచ్చాడు.. వంటి ఎన్నో సినిమాల్లోని పాత్రలు ప్రేక్షకులకు చక్కిలిగింతలు పెట్టించాయి. బిల్లా రంగా, అసెంబ్లీ రౌడీ, రౌడీగారి పెళ్లాం.. వంటి సినిమాల్లో మాస్ హీరోగా రాణించారు. యమ్ ధర్మరాజు ఎమ్ ఏ, పెదరాయుడు, రాయలసీమ రామన్నచౌదరి.. వంటి సినిమాల్లో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేసి ఇండస్ట్రీలో ప్రత్యేకంగా నిలిచారు.
నటన పట్ల ఆయనకు ఎంత శ్రద్ధ ఉంటుందో.. టైమింగ్ కు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారని పేరు. షూటింగ్ టైమ్ కు 10 నిమిషాల ముందే ఉండే మోహన్ బాబు క్రమశిక్షణ ఎందరికో స్ఫూర్తిని ఇస్తుందనడంలో సందేహం లేదు. 75 సినిమాలు నిర్మించి తెలుగులో అత్యధిక సినిమాలు తీసిన టాప్ 5 నిర్మాతల్లో ఒకరిగా నిలిచారు. శ్రీ విద్యానికేతన్ ను స్థాపించి విద్యారంగంలో కూడా రాణిస్తున్నారు. ఈ స్థాయికి ఎదిగిన మోహన్ బాబులోని విశిష్టతను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును కూడా అందించింది. ప్రస్తుతం ఆయన కుమారులు విష్ణు, మనోజ్, కుమార్తె లక్ష్మీ ప్రసన్న నటులుగా రాణిస్తున్నారు. సోషల్ మీడియాలో మోహన్ బాబు కెరీర్ పై #45yearsOfMohanBabu, #MB45 హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి.