కరోనా లాక్ డౌన్ దెబ్బకు చాలా సినిమాలు డైరెక్ట్ గా ఓటిటి ప్లాట్ఫామ్స్ లోనే విడుదల అయిపోయాయి. ఇక కోలీవుడ్ నుండి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ‘పెంగ్విన్’ కూడా ఇదే క్రమంలో అమెజాన్ ప్రైమ్ వీడియో లో కొద్ది గంటల క్రితం విడుదలైన విషయం తెలిసిందే. ఇక దాదాపు వంద రోజుల నుండి థియేటర్లు లేక పిచ్చెక్కిపోయిన సినీ జనాలు ఈ సినిమా కోసం బాగా ఎదురు చూశారు. ఇంతకీ ఈ చిత్రం ఎలా ఉంది? దీనికి కథ ఏమిటి? ఒకసారి చూద్దాం.
కీర్తి సురేష్ హీరోయిన్ గా ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ప్రొడ్యూసర్ గా ఉన్న ఈ చిత్రం ఆకట్టుకునే ప్రోమోస్ తో ఓటిటి వేదికగా విడుదలను అనౌన్స్ చేసినప్పటి నుండి అభిమానులలో చాలా ఆసక్తిని రేపింది ఈ ఎమోషనల్ మిస్టరీ థ్రిల్లర్ కు ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించారు.
ఇక కథ విషయానికి వస్తే ఆరేళ్ల తర్వాత కూడా తన కొడుకుని పోగొట్టుకున్న జ్ఞాపకం రిథమ్ని (కీర్తి సురేష్) ని వెంటాడుతూ ఉంటుంది. తన భర్తతో విడిపోయి మరొక వివాహం చేసుకున్న రిథమ్ ఏడు నెలల గర్భవతి. తరచూ తన కొడుకు కనిపించకుండా పోయిన సరస్సు దగ్గరకు వెళ్లి అతని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అయితే ఆమెకు ఉన్నఫలంగా అద్భుతమైన రీతిలో తన కొడుకు దొరుకుతాడు. కానీ అతను ఎంతో విచిత్రంగా ప్రవర్తిస్తుంటాడు. అసలు ఆ పిల్లాడిని ఎవరు తీసుకుని వెళ్లారు? అసలు ఎందుకు తీసుకొనివెళ్ళారు? మరల అతను ఎలా తిరిగి వచ్చాడు అన్న ప్రశ్నలు ఆమెను తొలిచేస్తుంటాయి. ఈ లోపల కనిపించకుండా పోయిన మరో పాప ఆచూకి తెలిసే క్రమంలో ఆమెకు ఎవరు ఎదురు పడతారు…. అసలు ఇన్నిరోజులు రిథమ్ కు అంతటి క్షోభను కలిగించింది ఎవరు? ఇది స్టోరీ యొక్క సారాంశం.
ఇకపోతే పెంగ్విన్ సినిమాలో అన్నింటికన్నా హైలెట్ విజువల్స్. కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్ అంతే. ఇక సంతోష్ నారాయణ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ టెన్షన్ పెంపొందిస్తూ ఉత్సుకత క్రియేట్ చేయడంలో స్పెషలిస్ట్ అన్న విషయం తెలిసిందే. మొదటి సన్నివేశంలోనే ఈ చిత్రం వీక్షకులను అరెస్ట్ చేస్తుంది. ఇక ఈ సినిమాలో తర్వాత మాట్లాడుకోవలసింది అద్భుతమైన లైటింగ్ గురించి. రెడ్, బ్లూ లాంటి వైబ్రెంట్ కలర్స్ తో టెన్షన్ క్రియేట్ చేయడంతో జనాలను స్టోరీ కట్టిపడేస్తుంది. ప్రథమార్థంలో అయితే ఉత్కంఠభరిత సన్నివేశాలు, సంఘటనలు చూస్తే ఇది ఒక పర్ఫెక్ట్ ‘ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్’ అవుతుందని అన్న భావనను మనకు కలిగిస్తాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ షాక్ తో సినిమాకు మంచి హైప్ వస్తుంది. ఆ తర్వాత అదే ఫ్లో ను కొనసాగించడంలో ఈశ్వర్ కొద్దిగా ఇబ్బంది పడి ప్రేక్షకులను ఇబ్బంది పెట్టాడు.
ఇక దర్శకుడు మొదటి నుండి ఏమి ప్రాజెక్టు చేయాలనుకుంటున్నాడో ప్రేక్షకుడికి ఈజీగా అర్థం అయిపోతుంది. తన పిల్లాడు ఎలా తప్పిపోయాడు అనే ప్రశ్నకి రిథమ్ సమాధానాలు వెతుక్కునే క్రమంలో మాజీ భర్త మరియు ప్రస్తుత భర్త పై అనుమానం కలిగించేలా దర్శకుడు ప్రయత్నిస్తాడు కానీ వాటి వల్ల కథకు ఎలాంటి ప్రయోజనం లేదు. ఇక పిల్లల్ని ఎత్తుకెళ్లి దారుణంగా చంపేసిన సైకో ఆచూకీ తెలుసుకునేందుకు తీసిన సన్నివేశాలు… పోలీస్ ఇంటరాగేషన్ లో ముఖాముఖి సన్నివేశాలు వంటివి అంతకు ముందు సినిమాల్లో చూసినవే. ఒక సుదీర్ఘంగా సాగే వారిద్దరి ప్రశ్నల గేమ్ అయితే చాలా పాయింట్లెస్గా, ఇల్లాజికల్గా అనిపిస్తుంది.
ఇకపోతే ఏ థ్రిల్లర్ సినిమా అయినా తప్పు చేసిన వ్యక్తి లేదా సైకో యొక్క అతని మోటో (అలా చేసేందుకు అతనిని ప్రేరీపించిన కారణం, దాని వల్ల అతనికి వచ్చే లాభం) ఎంత లాజికల్ గా ఉంటే సినిమా కు అంత ఎక్కువ మార్కులు పడతాయి. అయితే అప్పటివరకు ఆసక్తిగా ఎదురు చూసిన అన్ని ప్రశ్నలకు ప్రేక్షకులకు కన్విన్స్ కాని సమాధానాలు వచ్చాయి అంటే మాత్రం ఇంత సేపు క్రియేట్ చేసిన టెన్షన్ ప్రేక్షకులను కట్టిపడేసిన వైనం మొత్తం బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. అయితే పిజ్జా లాంటి షాకింగ్ క్లైమాక్స్ ఉన్న అద్భుతమైన చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన కార్తీక్ సుబ్బరాజు ఇటువంటి ఒక కథను యాక్సెప్ట్ చేసి ఫండ్ చేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలు పాటించడం…. కీర్తిసురేష్ అద్భుతమైన పర్ఫామెన్స్ కి స్టోరీ మరికొద్దిగా రీజనబుల్ గా పెట్టి ఉంటే ఫలితం వేరేలా ఉండేది.
రేటింగ్ : 2.75/5
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!