చిన్నారుల నుంచి పెద్దవారి వరకూ ఎవరు పుట్టిన రోజు జరుపుకున్నా ఆ వేడుక ఓ సంబరం అవుతుంది. అదే.. సినీ పరిశ్రమలో టాప్ సెలబ్రిటీలు ఈ వేడుక చేస్తే సినిమా హడావిడే నెలకొంటుంది. తారలంతా ఒక చోట కలుస్తారు. సరదా కబుర్లతో గడిపేస్తారు. వాళ్ల కబుర్లు, పిక్స్ ప్రేక్షకులకు కన్నుల పండుగగా ఉంటుంది. ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటారు. అటువంటి సందడే డిసెంబర్ 17న టాలీవుడ్ లో జరిగింది. అగ్ర నిర్మాత దిల్ రాజు తన 50వ పుట్టినరోజు వేడుకను ఘనంగా జరుపుకున్నారు. తారలంతా ఒకచోట చేరారు. అగ్ర కుటుంబాల వారంతా హాజరయ్యారు. అయితే..
ఈ వేడుకల్లో నందమూరి, దగ్గుబాటి, అల్లు కుటుంబాల నుంచి ఎవరూ హాజరైనట్టు లేదు. బాలకృష్ణ, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, వెంకటేశ్, సురేశ్ బాబు, రానా, అల్లు అరవింద్, అల్లు అర్జున్, నాగార్జున.. ఇలా వీరంతా హాజరు కాలేదు. అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగచైతన్య, సమంత, అఖిల్ హాజరయ్యారు. పైన పేర్కొన్నవారిలో మిగిలిన వారు హాజరు కాలేదు. దర్శకుల్లో కూడా రాఘవేంద్రరావు, అనిల్ రావిపూడి మినహా మిగిలిన వారు రాలేదని తెలుస్తోంది. దిల్ రాజుకు ఇండస్ట్రీలో అందరితో సత్సంబంధాలు ఉన్నాయి. దాదాపు అన్ని అగ్ర కుటుంబాల హీరోలతో సినిమాలు తీశారు. కాంట్రవర్శీకి దూరంగా ఉండే దిల్ రాజు తన బర్త్ డేని భార్య, కుమార్తె, అల్లుడు, మనవరాలితో సహా సంబంరంగా జరుపుకున్నారు.
ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేశ్, రామ్ చరణ్, ప్రభాస్, విజయ్ దేవరకొండ, రామ్, నితిన్, వరుణ్ తేజ్, కన్నడ హీరో యాశ్, ప్రశాంత్ నీల్, పూజా హెగ్డే, నివేదా పేతురాజ్.. తదితరులంతా హాజరయ్యారు. దీంతో దిల్ రాజు పుట్టినరోజు వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. అయితే.. బాలయ్య, వెంకటేశ్, నాగార్జున, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రానా కూడా హాజరై ఉంటే ఫంక్షన్ మరింత హైలైట్ అయ్యేదే. ఫంక్షన్లకు దూరంగా ఉండే పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు. బన్నీ, ఎన్టీఆర్, రానా గైర్హాజరీలో ఎటువంటి కాంట్రవర్శీ లేదు. కాకపోతే.. హీరోలందరూ ఒక చోట కలిస్తే కన్నులపండుగగా ఉండేదని చెప్పడంలో సందేహం లేదు. ప్రస్తుతం నెట్టింట్లో ఈ ఫొటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.