తీగ లాగితే డొంకంతా కదిలింది.. అని సామెత. అలానే ఉంది ప్రస్తుతం బాలీవుడ్ పరిస్థితి. హీరో సుశాంత్ ఆత్మహత్య అటు తిరిగి ఇటు తిరిగి డ్రగ్స్ వైపు వెళ్లింది. దీంతో ఎందరో సెలబ్రిటీల పేర్లు లిస్టులోకి వచ్చాయి. సీబీఐకి సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా ఇచ్చిన సమాచారం కీలకం కావడతో ఎన్ సీబీ (నార్కో కంట్రోల్ బ్యూరో) రంగంలోకి దిగింది. అందరికీ షాక్ ఇచ్చేలే బాలీవుడ్ షో గన్ కరణ్ జోహార్ పేరు వెలుగులోకి వచ్చింది. ఏకంగా 2019లో ఆయన ఇచ్చిన ఓ పార్టీపై ఎన్ సీబీ కన్ను పడింది. డిసెంబర్ 17 గురువారం ఎన్ సీబీ కరణ్ జోహార్ కు నోటీసులు ఇవ్వడం కలకలం రేపింది.
కరణ్ కు ఇచ్చిన నోటీసులు ఎన్ డీపీఎస్ యాక్ట్ 67బి సెక్షన్ కింద నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసుల ప్రకారం ఎవరూ వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదు. వీడియో ద్వారా ఎన్ సీబీకి వారు కోరిన వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సమన్లు జారీ చేస్తూ.. ఈ పార్టీ ఎక్కడ, ఎప్పుడు జరిగింది. పార్టీలో పాల్గొన్న వారి పూర్తి వివరాలు, ఎంత మంది, ఏ డ్రగ్స్ వాడారు, తీసిన వీడియోను ఏ కెమెరాతో షూట్ చేశారు.. అనే వివరాలు ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ వివరాలను డిసెంబర్ 18నే ఇవ్వాలంటూ ఒకరోజు గడువు మాత్రమే ఇచ్చింది. దీంతో శుక్రవారానికే ఎన్ సీబీకి కరణ్ జోహార్ వివరాలు అందించాల్సి ఉంది.
ప్రస్తుతం ఈ వార్త బీటౌన్ ను కుదిపేస్తోంది. వీడియో కనిపించిన వారు కాకుండా ఇంకా ఎవరెవరు ఈ పార్టీలో పాల్గొన్నారు అనే అంశంపై ఆసక్తి నెలకొంది. పైగా.. ఈ సమన్లు వీడియోలో కనిపించిన మిగిలిన సినిమా తారలు ఎవరికీ ఇవ్వకపోవడం విశేషం. దీంతో కరణ్ జోహార్ ఎలా సమాధానం ఇస్తాడో, తదుపరి పర్యవసనాలు ఎలా ఉంటాయో అని బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రస్తుతం ఆ పార్టీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.