Nithiin: టాలీవుడ్ హీరో నితిన్ గత కొంత కాలం నుంచి వరుస ఫ్లపులతో సతమతం అవుతున్న సంగతి తెలిసిందే. `భీష్మ`తో బ్లాక్ బస్టర్ హిట్ను ఖాతాలో వేసుకున్న ఈయన.. అదే జ్యూష్తో చెక్, రంగ్దే చిత్రాలు చేశాడు. కానీ, భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.
ప్రస్తుతం నితిన్ `మాచర్ల నియోజకవర్గం` అనే సినిమా చేస్తున్నాడు. ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. నితిన్ మరో సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్ధం అవుతున్నాడు.
సినీరచయిత వక్కంతం వంశీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎన్నో హిట్ చిత్రాలకు కథ అందించిన ఆయన..`నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` మూవీతో దర్శకుడిగా మారాడు. కానీ, ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. దాంతో సహజంగానే వంశీకి గ్యాప్ వచ్చేసింది.
అయితే ఇప్పుడు ఆయనతో నితిన్ ఓ సినిమా చేయబోతున్నాడట. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ సినిమాకు `జూనియర్` అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. ఠాగూర్ మధు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నారని అంటున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.