సినిమాకు హీరో ఎంత ముఖ్యమో విలన్ కూడా అంతే ముఖ్యం. హీరో పవర్ ఫుల్ గా కనిపించాలంటే విలన్ అంతే పవర్ ఫుల్ గా కనిపించాలి. నటన, హవభావాలు, ఆహార్యం, యాక్షన్ లో నేర్పరితనం.. ఇలా అన్నీ ఉండాల్సిందే. భారీ దేహదారుడ్యం, జెంటిల్ మెన్ తరహా విలనిజం నుంచి ప్రస్తుతం సిక్స్ ప్యాక్ విలనిజంకు విలన్ రూపం మారింది. ఇలాంటి లుక్ లో తెలుగు సినిమాల్లో తనదైన విలనిజం పండించిన నటుడు ‘సోనూసూద్’. సినిమాల్లో దశాబ్దానికి పైగా విలన్ పాత్రల్లో మెప్పించిన ఈ నటుడు ఇప్పుడు ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై సినిమాల్లో విలన్ గా నటించనంటున్నాడు.
హిందీ, తెలుగు సినిమాల్లో మాత్రమే ఎక్కువగా వినిపించిన సోనూసూద్ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. కారణం.. కరోనా, లాక్ డౌన్ సమయంలో ఆయన వలస కార్మికులకు చేసిన సాయం, ఇప్పుడు ఆదుకో అన్నా.. అనే మెసేజ్ రావడమే తరువాయి ఎవరికైనా సాయం అందిస్తున్నాడు. సోనూ ఫొటోను దేవుడి మందిరాల్లో పెట్టుకుంటున్నారు.. సోనూ పేరు పెట్టుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారు.. సోనూ సాయంతో చదువుకుంటున్నారు కూడా. ఈస్థాయిలో ప్రజల్లో హీరో అయిన సోనూ.. ఇకపై సినిమాల్లో విలన్ వేషాలు వేయనంటున్నాడు. ‘ఇప్పుడు సినిమాల్లో మంచి పాత్రలు వస్తున్నాయి. తక్కువ సినిమాలే చేసినా పాజిటివ్ పాత్రలే చేస్తాను’ ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.
ప్రజలకు చేయాల్సింది చాలా ఉంది అని కూడా అంటున్నాడు. ‘khud kamaao ghar chalaao’ అనే యాప్ ద్వారా యువతకు తమ కాళ్ల మీద తాము నిలబడేలా ఎంప్లాయిమెంట్ ఇవ్వడం చాలా ముఖ్యం అంటున్నాడు. వారికి కావల్సింది సమకూర్చడం కంటే ఉపాధి ఇప్పిస్తే వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడే అవకాశం ఉంటుందని అంటున్నాడు. ఇటివలే ఏషియన్ టాప్ సెలబ్రిటీస్ లో నెంబర్ వన్ గా నిలిచిన సోనూసూద్ నిర్ణయం మంచిదే. కాకపోతే.. ఇకపై సినిమాల్లో సోనూ విలనిజం చూపకపోవడమే ప్రేక్షకుల్ని కాస్త నిరాశపరిచేదే. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నాడు సోనూసూద్.