సీనియర్ అగ్ర హీరో, తెలుగుదేశం పార్టీని స్థాపించి రాజకీయాల్లో పెను మార్పులు సృష్టించిన ఎన్టీఆర్ జీవితం ఆధారంగా ఆయన తనయుడు బాలకృష్ణ చేసిన బయోపిక్ బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయ్యింది కానీ.. రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన `లక్ష్మీస్ ఎన్టీఆర్`పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా మార్చి 22న విడుదల కానుంది. ఈ సినిమాపై ఇంత ఆసక్తి క్రియేట్ కావడానికి కారణం వాస్తవికతకు దగ్గరగా ఉండటమే. ఎన్టీఆర్ చివరి కాలంలో ఆయన లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత జరిగిన నాటకీయ పరిణామాల మధ్య ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇతర కుటుంబ సభ్యులు అంతా కలిసి ఒక్కటై ఆయన్నుండి ముఖ్యమంత్రి పదవిని లాక్కున్నారు.
ఈ విషయాన్ని వర్మ ఈ `లక్ష్మీస్ ఎన్టీఆర్`లో చూపించనున్నారు. రీసెంట్గా విడుదలైన రెండు ట్రైలర్స్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను తప్పుగా చూపిస్తుందని వారు భావిస్తున్నారు. `వాడు(చంద్రబాబు నాయుడు), నా కుటుంబ సభ్యులు కలిసి నన్ను చంపేశారు` అనే డైలాగ్ సహా పలు సన్నివేశాలపై వారు అభ్యంతరకరంగా ఉన్నారట.
రెండు నెలల్లో ఎన్నికలు రానున్నాయి. ఇలాంటి సందర్భంలో ఈ సినిమా విడుదలైతే కచ్చితంగా తెలుగు దేశం పార్టీకి నష్టం జరుగుతుందని వారు భయపడుతున్నారట. అందుకని మార్చి 22న విడుదల కాబోయే `లక్ష్మీస్ ఎన్టీఆర్`ని ఆపించేయాలని వారు న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారట. ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయమేమంటే.. ఈ చిత్ర నిర్మాత వై.ఎస్.ఆర్.సి.పి పార్టీ నాయకుడు కావడం కూడా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు రుచించడం లేదు. దీంతో సినిమాను ఎలాగైనా ఆపించేయాలని చూస్తున్నారని వార్తలు వినపడుతున్నాయి.
previous post
next post