వరుస హిట్ సినిమాలతో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. టెంపర్ సినిమా దగ్గర నుంచి ఆయన నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ మరింత పెరిగింది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన ఈ సినిమాతో తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఎన్టీఆర్ పేరు తెచ్చుకున్నాడు. అన్ని ఇండస్ట్రీల్లోనూ ఎన్టీఆర్ అభిమానులను కూడగట్టుకున్నాడు. దీంతో తారక్ ఫోకస్ కూడా పాన్ ఇండియా సినిమాలపై పడింది. దీంతో తన సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేలా నిర్మాతలతో ఎన్టీఆర్ డీల్ కుదుర్చుకుంటున్నాడు.
కొరటాల శివతో సినిమా స్టార్ట్
పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోవాలనే ప్రయత్నాల్లో ఎన్టీఆర్ ఉన్నాడు. ఈ క్రమంలో రెండు క్రేజీ ప్రాజెక్టులను ఎన్టీఆర్ ప్రకటించాడు. జనతా గ్యారేజ్ సినిమా హిట్ తర్వాత కొరటాల శివతో కలిసి ఎన్టీఆర్ ప్రస్తుతం ఒక సినిమా చేస్తున్నాడు. ఎన్టీఆర్ 31వ చిత్రంగా ఇది విడుదల కానుంది. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. దీంతో పాటు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ భారీ బడ్జెట్ సినిమా చేయనున్నాడు.
ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ సినిమాపై ఆసక్తి
ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో రానున్న సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ సినిమాను ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది సమ్మర్ కు ఈ సినిమాను పూర్తి చేసి తెరమీదకు తీసుకురావాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రానున్న సినిమా ప్రారంభం కానుంది.
సలార్ తర్వాతనే ఎన్టీఆర్ సినిమా
అయితే సలార్ రెండు భాగాలుగా ఉంటుందని, దీంతో ఎన్టీఆర్ తో సినిమా ప్రారంభం కావడానికి మరికొంత సమయం పడుతుందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే సలార్ పార్ట్-1 అయిన తర్వాత ఎన్టీఆర్ సినిమాను ప్రశాంత్ నీల్ స్టార్ట్ చేసే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది.