OTT Trend: కాలం మారుతుంది.. సినీలోకం కొత్తగా ముందుకెళ్తుంది.. అందుకు తగ్గట్టు మనిషి ఆలోచన మారుతుంది.. అభిప్రాయం మారుతుంది..ఇంకా కలం మారకపోతే ఎలా..!? కథలు మారకపోతే ఎలా..!? బిల్డప్పులున్న హీరోలు.., భారీ ఫీట్లు.., హీరోయిన్లతో డ్యూయెట్లు.., పైపైన సరసాలు.., విలన్ తో డమ్మీ ఫైట్లు.., ఛేజింగులు చెల్లవిక అంతా డైరెక్ట్. అడగాలన్నా, చేయాలన్నా, చూపించాలన్నా అంతా డైరెక్టుగానే.. ఓటీటీ పుణ్యమాని ఇంటింటికీ బూతుబుల్లెట్లు, బూతుకత్తిలు (బూతు డైలాగులు, బులెట్ సీన్లు, కత్తి పోట్లు) సరఫరా అవుతున్నాయి. పిల్లలున్న ఇళ్లల్లో పిల్లలకు తెలియకుండా దొంగచాటుగా, జాగ్రత్తగా చూసే సినిమాలు ఓటీటీల్లో వచ్చేస్తున్నాయి. జనం వాటికి అలవాటు పడ్డారు, అనేకంటే ఓటీటీలు జాగ్రత్తగా వాటిని అలవాటు చేసాయనడం ఉత్తమం..!
OTT Trend: మీకు తెలుసా..!? బిజినెస్ అవేనట..!!
ఓటీటీకి అంటూ ఓ మాంచి ఫామిలీ సినిమానో, ఓ మంచి లవ్ స్టోరీ నో, ఓ మాంచి ఎమోషన్ స్టోరీనా తీస్తే నిర్మొహమాటంగా తిరస్కరిస్తారు. ఆహా అయినా అమెజాన్ అయినా, నెట్ ఫ్లిక్ అయినా … “సర్ ఒక సినిమా ఉంది అని ఓటీటీ ఓనర్ దగ్గరకు వెళ్తే బోల్డ్, సెక్స్, క్రైమ్, హర్రర్, థ్రిల్లర్ అంటేనే ఓపికగా కథ వింటారు, సినిమా చూస్తారు. లేకపోతే సెలవు చెప్పేస్తారు. ఒకవేళ ఏదైనా ఫామిలీ, లవర్, ఎమోషనల్ తీయాలి అనుకుంటే పెద్ద రికమెండేషన్లు, పెద్ద పెద్ద హీరోలు ఉండాల్సిందే. తెలుగులోనే ఓటీటీల్లో ఎక్కువగా అమ్ముడవుతున్న సినిమాలు బోల్డ్ కంటెంట్ మాత్రమే. దీనిలో పరిమితులు లేవు. ఎంతైనా చూపించుకోవచ్చు. ఏమైనా మాట్లాడుకోవచ్చు. తెలుగులో డబ్బింగ్ అయిన ఓటీటీల్లో “మీర్జాపూర్” అత్యంత దారుణమైన డైలాగులు ఉంటాయి. పచ్చిగా.. ఇద్దరు మిత్రులు మాట్లాడుకున్నట్టే మొత్తం డైలాగులు ఉంటాయి. దానిలోనూ, డోమ్ లోనూ సీన్లు కూడా ఫుల్ గా ఉంటాయి. బోల్డ్, వివాదాస్పదం, బూతు, క్రైమ్ వంటి వాటిని మాత్రం వెంటనే కొంటున్నారు. వాటికి మంచి బిజినెస్ జరుగుతుంది. అలా ఓటీటీల ద్వారా ఇంటింటికీ బూతు సరఫరా జరుగుతుంది.. ఇలా అనే కంటే ఏడాదికి కొంత చెల్లించి ప్రేక్షకులే బూతుని కొనుక్కుంటున్నారు అంటే మంచిదేమో..
పెరుగుతున్న పోటీ..!?
తెలుగులో ఓటీటీల్లో ప్రస్తుతం పోటీ పెరుగుతుంది. మొదట నెట్ ఫ్లిక్ వచ్చింది. ఆపై గత నాలుగేళ్లుగా అమెజాన్ ప్రైమ్ దూసుకుపోతుంది. ప్రస్తుతం ఆహా, హాట్ స్టార్, సన్ నెక్స్ట్, జీ 5 వంటి ఓటీటీలు ఉన్నప్పటికీ కొత్తగా వచ్చిన స్పార్క్ అన్నింటికీ పోటీ ఇస్తుంది. రామ్ గోపాల్ వర్మ స్టైల్ లో బోల్డ్, క్రైమ్, హర్రర్, థ్రిల్లర్ కథలను అందించడంలో ముందుంది. కథల ఎంపిక, వాటిని తెరకెక్కిస్తున్న విధానం కొత్తగా ఉంటుంది. ఇవి చాలక ఇక అగ్ర నిర్మాత దిల్ రాజు, సినీ హీరో నాగార్జున కూడా కొత్తగా ఓటీటీల్లోకి రానున్నట్టు వార్తలు వస్తున్నాయి..