Pawan Ap Issue: ఇప్పుడు ఆంధ్రాలో ఎక్కడ విన్నా, ఎక్కడ చూసినా ఒక్కటే అంశం నడుస్తోంది. అదే సినిమా టిక్కెట్ల రేట్లు. ఇది వరకు థియేటర్ల యాజమాన్యానికి, డిస్ట్రిబ్యూటర్లకు రేట్ల విషయంలో స్వతంత్రం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. తాజాగా ఏపీ ప్రభుత్వం టిక్కెట్ల రేట్ల విషయంలో ఓ జీవో విడుదల చేసింది. అప్పటి నుండి పరోక్షంగా తెలుగు పరిశ్రమకి, ప్రభుత్వానికి వార్ నడుస్తోంది. చిన్న సినిమాలైతే పెద్ద సమస్య ఉండదు కానీ, నేడు పరిస్థితులు మారాయి. మనవాళ్ళు పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ జీవో వలన బడా నిర్మాతలు నష్టపోయే అవకాశం లేకపోలేదు.
ఒక్క పవన్ మీద కోపం మొత్తం పరిశ్రమపై చూపిస్తున్నారా?
ఈ విషయమే చాలామందికి అంతుబట్టడంలేదు. ఓ వైపు జనసేనాని ఈ విషయాన్ని ఆల్రెడీ జన సమావేశాల్లో నొక్కి చెప్పడం జరిగింది. కానీ ఈ విషయం పై అనేక మంది అనేక రకాలుగా వాదనలు వినిపిస్తున్నారు. ఓ వర్గం దీన్ని సమర్దిస్తే, మరో వర్గం ససేమిరా అంటున్నాయి. ఇక లోగుట్టు పెరుమాళ్ళకెరుక గాని ఒక్కటి మాత్రం స్పష్టం. ఇలాంటి చర్యల వలన సినిమానే నమ్ముకున్న కార్మిక వర్గాలు, ఇతరత్రా టెక్నీషియన్లు చాలా ఇబ్బందులు పాలయ్యే అవకాశం లేకపోలేదు.
ప్రస్తుతం తెలంగాణాలో ఈ పరిస్థితి వుందా?
ఖచ్చితంగా లేదనే చెప్పాలి. కరోనా కష్టకాలం తరువాత ఇపుడిపుడే సినీ పరిశ్రమ నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది. మధ్యలో ఈ ఓమిక్రాన్ ఒకటి. ఎపుడు ఎలా ఉంటుందో, ఎలా మారుతుందో ఎవరికీ అంతు బట్టడం లేదు. ఇలాంటి పరిస్థితిలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొంతమందికి మింగుడు పడటం లేదు. ఇది కేవలం పవన్ పైన వున్న కోపం కారణంగానే తీసుకున్న నిర్ణయమని ఓ వర్గం గట్టిగా వాదిస్తోంది. అయితే ఇందులో వాస్తవం లేకపోలేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఎన్నో పరిశ్రమలు ఉండగా కేవలం సినిమా వాళ్లపైనే ఈ కక్ష సాధింపు చర్యలు ఏంటనే చర్చ వేడిగా సాగుతోంది.