Megastar Chiranjeevi : ఇటీవలే గోవాలో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఇఫీ) నుండి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ఇండియా-2022 పురస్కారాన్ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ఎక్కని ఎత్తులు లేవు అన్నది నిర్వివాదాంశం. స్వయంకృషితోనే ఆయన అనితర సాధ్యమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. 67 ఏళ్ల వయసులో కూడా బాక్స్ ఆఫీస్ వద్ద క్రౌడ్ పుల్లర్ గా చిరంజీవి తన సత్తా చాటుకుంటున్నారు. మెగాస్టార్ సాధించిన విజయాలు,సృష్టించిన రికార్డులు,అందుకున్న అవార్డుల గురించి అందరికీ తెలుసు.వాటి గురించి రాయడం చర్విత చరణమే అవుతుంది. సీనియర్ మోస్ట్ సినీ జర్నలిస్టు బి కే ఈశ్వర్ చిరంజీవి మూవీ కెరీర్ ఎలా ప్రారంభమైందో ఈమధ్య ఒక వీడియో కథనంలో తెలిపారు. అందులోని ప్రధాని అంశం అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంది.
చిరంజీవిని పల్లకీ ఎక్కించింది వాళ్ళెవరూ కాదు!
అల్లు రామలింగయ్య అల్లుడు కావటం, అల్లు అరవింద్ ప్లానింగ్ తోడు కావడం, కోదండరామిరెడ్డి, రాఘవేంద్రరావు వంటి దిగ్దర్శకుల చేతిలో పడడం వంటి కారణాల వల్ల చిరంజీవి మెగాస్టార్ అయిపోయారు అన్నది బయటి ప్రపంచం చెప్పుకునే మాట. అసలు వాస్తవం ఏమిటంటే చిరంజీవి పల్లకికి వారంతా బోయీలు మాత్రమే అని ఈశ్వర్ తెలిపారు.
ఆ ఘనత అంతా ఆ కామెడీ స్టార్ దే!
చిరంజీవి సినీ రంగ ప్రవేశం వెనక ఉన్న ఆసక్తికరమైన కథనాన్ని ఈశ్వర్ బయట పెట్టారు. చిరంజీవితో పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచతుడైన కామెడీ స్టార్ సుధాకర్, దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఒక వెలుగు వెలిగి హఠాన్మరణం చెందిన హీరో హరి ప్రసాద్ ఒకే ఫిలిం ఇన్స్టిట్యూట్ లో శిక్షణ పొందారు. ఆ తదుపరి ఎవరికి వారు సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేసుకుంటున్న తరుణంలో ముందుగా సుధాకర్ కు పునాదిరాళ్లు చిత్రంలో ఓ పాత్ర లభించింది. అయితే అదే సమయంలో సుధాకర్ కు తమిళంలో భారతీరాజా దర్శకత్వంలో కూడా అవకాశం వచ్చింది. భారతీ రాజాకు అప్పటికే పేరు ప్రఖ్యాతలు ఉండడంతో సుధాకర్ ఆ తమిళ సినిమాలో నటించాలని నిర్ణయించుకున్నాడు.
ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఇదే విషయాన్ని పునాదిరాళ్లు దర్శకుడు రాజకుమార్ కు చెప్పటానికి సుధాకర్ అక్కడికి వెళ్ళగా ఆ సమయంలో చిరంజీవి అక్కడే ఉన్నారు. రాజకుమార్ కు విషయమంతా చెప్పేసిన సుధాకర్ అంతటితో ఆగలేదు.తనకు ఇస్తానన్న పాత్రనుచిరంజీవికి ఇవ్వవలసిందిగా దర్శకుడు రాజకుమార్ కు సుధాకర్ సూచించారు.ఆ తర్వాత ఆడిషన్స్ పెట్టి చిరంజీవికి ఆ పాత్రను దర్శకుడు రాజకుమార్ పునాదిరాళ్లు చిత్రంలో ఇచ్చాడు.ఆ తర్వాత తన ప్రతిభతో రాణించివ చిరంజీవి ఇక వెను తిరిగి చూసుకోలేదన్నది చరిత్ర. ఒక్క మాటలో చెప్పాలంటే మెగాస్టార్ కు ఊపిరి లూదింది ఈ కామెడీ స్టార్ సుధాకరే!
స్నేహ ధర్మం పాటించిన చిరంజీవి!
అయితే చిరంజీవి కూడా తన ఫిలిం ఇన్స్టిట్యూట్ మిత్రులైన సుధాకర్ హరిప్రసాద్ మరో స్నేహితుడు నారాయణరావు లను విస్మరించలేదు.తానో పెద్ద స్టార్ గా మారిపోయాక ఆ ముగ్గురు స్నేహితులకు తనతో ఒక సినిమా చేసుకోమని ఆఫర్ ఇవ్వగా వారు రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి తో యముడికి మొగుడు అనే సినిమా నిర్మించారు.ఆ సినిమా సూపర్ హిట్ అయి కనక వర్షం కురిపించింది.తద్వారా మిత్రులకు చిరంజీవి లాభాలు చేకూర్చి పెట్టారని ఈశ్వర్ వివరించారు.