prabhas-adipurush: టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపును సంపాదించుకున్నాడు. అంతేకాకుండా బాహుబలి చిత్రం ద్వారా పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్న ప్రభాస్ కు వరుస అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికీ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అదేవిధంగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ చిత్రంలో రాముడి పాత్రలో కనిపించనున్నాడు.
రామాయణ ఇతిహాసాల ఈ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్ కనిపించగా రావణుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. అయితే ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించిన మిగిలిన నటీనటులను ఎవరిని చిత్రబృందం ప్రకటించలేదు. కానీ తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ‘ఆదిపురుష్’ చిత్రంలో లక్ష్మణుడి పాత్రకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
ఇకపోతే ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇదొక శుభవార్తే అని చెప్పవచ్చు. ప్రభాస్”ఆదిపురుష్” చిత్రంలో రాముడికి సోదరుడుగా లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ నటించనున్నాడట. అదేవిధంగా సీత పాత్రలో నటించడానికి బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నీ ఎంపిక చేశారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీటిలో ఎంతవరకు నిజం ఉందనే విషయం గురించి చిత్ర బృందం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరి లక్ష్మణుడి పాత్రలో ఎవరు నటిస్తున్నారనే విషయం గురించి తెలుసుకోవాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని త్రీడీ విజువల్ గ్రాఫిక్స్ తో ఒక వండర్ లా రూపొందించనున్నారు. దీని కోసం పెద్ద మొత్తంలోనే బడ్జెట్ ను ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని టీ-సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ – క్రిషన్ కుమార్ – ప్రసాద్ సుతార్ – రాజేష్ నాయర్, ఓం రౌత్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే సంవత్సరం ఆగస్టు11 న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపారు.