ప్రాంతీయ సినిమల్లో హీరోగా మొదలైన ప్రస్థానం జాతీయస్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగితే ఏ హీరోకైనా ఆనందమే. ఆ హీరోని అభిమానించే వారికి గుడ్ న్యూస్ అవుతుంది. ఫ్యాన్స్ కి పూనకాలే వచ్చేస్తాయి. ప్రస్తుతం అలాంటి స్థితిలో ఉన్న హీరో ప్రభాస్. రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ప్రస్తుతం జాతీయస్థాయి హీరో. పాన్ ఇండియా రేంజ్ తప్పితే మామూలు సినిమాలు తీసే పరిస్థితి లేదు. బాహుబలితో వచ్చిన క్రేజ్ అంతర్జాతీయ ఖ్యాతిని కూడా ఆర్జించి పెట్టింది. ఇదే ఇప్పుడు ఏషియన్ టాప్ సెలబ్రిటీస్ లో చోటు సంపాదించాడు. మరోవైపు సోనుసూద్ ఏకంగా ఈ లిస్టులో టాప్ వన్ పొజిషన్ లో నిలవడం మరింత సంచలనం రేపుతోంది.
ప్రముఖ యూకే మ్యాగజైన్ ఈస్ట్రన్ ఐ 2020 ఏషియన్ సెలబ్రిటీ ఎవరు అంటూ ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో సోనుసూద్ కు భారీగా ఓట్లు పోలయ్యాయి. లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులకు సాయం చేసి దేశవ్యాప్తంగా హీరో అయిపోయాడు ఈ సినిమా విలన్. ఆ తర్వాత కూడా సోనూసూద్ తన చారిటీలను కొనసాగిస్తూ భారతీయుల మనసులు దోచుకున్నాడు. దీంతో సోనూసూద్ నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టారు. ప్రభాస్ కు బాహుబలితో వచ్చిన క్రేజ్, సాహో జపాన్ లో సూపర్ హిట్.. ఇలా ప్రభాస్ పేరు మోగిపోతోంది. దీంతో ప్రభాస్ కు 7వ స్థానం దక్కింది. సౌత్ నుంచి ఈ ఘనత సాధించిన సెలబ్రిటీ ప్రభాస్ ఒక్కడే కావడం విశేషం.
ఇక బాలీవుడ్ తోపాటు, హాలీవుడ్ హీరోయిన్ గా కూడా పేరు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా 6వ స్థానంలో నిలిచింది. సినిమా, సంగీతం, టెలివిజన్, సోషల్ మీడియా, సాహిత్యం, సేవ.. తదితర రంగాల్లో ఈ సర్వే చేశారు. ఈ ప్రాతిపదికన చేపట్టిన టాప్ 50 సెలబ్రిటీస్ ఆఫ్ ఆసియా సర్వేలో సోనూసూద్, ప్రియాంక చోప్రా, సోనూసూద్ మొదటి పది స్థానాల్లో చోటు దక్కించుకోవడం విశేషం.