Pawan Kalyan-Vijayendra Prasad : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల విరామం తర్వాత సినిమాలు చేయడానికి ఒప్పుకోవడంతో ఇతనికి వరుస అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే “వకీల్ సాబ్” సినిమా షూటింగ్ పూర్తి అయి విడుదలకు సిద్ధంగా ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం పవన్ కళ్యాణ్, రానా మల్టీస్టారర్ గా మలయాళ సినిమా “అయ్యప్పనుమ్ కోశియమ్” అనే రీమేక్ సినిమాలోనూ నటిస్తున్నాడు. అదేవిధంగా హరిహర వీరమల్లు (వినిపిస్తున్న టైటిల్) సినిమాలో కూడా పవన్ నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలే కాకుండా సురేందర్ రెడ్డి, హరీష్ శంకర్ సినిమాలలో పవన్ నటిస్తున్నట్లు ఇదివరకు ప్రకటించిన విషయం మనకు తెలిసిందే.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన చేతిలో ఇన్ని సినిమాలను పెట్టుకొని ఎంతో బిజీగా గడుపుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కోసం ఓ స్టార్ రైటర్ గా, పాన్ ఇండియా రైటర్ గా మంచి పేరును సంపాదించుకున్న విజయేంద్ర ప్రసాద్ రంగంలోకి దిగి పవన్ కళ్యాణ్ ను దృష్టిలో ఉంచుకొని కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే విజయేంద్రప్రసాద్ తయారు చేస్తున్న కథను తెరకెక్కించడానికి ఏ దర్శకుడు ముందుకు వస్తాడో తెలియాల్సి ఉంది. సాధారణంగా విజయేంద్రప్రసాద్ ఎక్కువగా తన కథలను ఎస్ ఎస్ రాజమౌళికి ఇవ్వడంతోపాటు మరి కొందరు దర్శకులు కూడా కథలను రాస్తుంటారు.
పవన్ ను అభిమానించే విజయేంద్రప్రసాద్:
విజయేంద్రప్రసాద్ బజరంగీ భాయ్జాన్, తలైవి వంటి పలు చిత్రాలకు కూడా కథను అందించాడు. అయితే విజయేంద్రప్రసాద్ సురేందర్ రెడ్డి, హరీష్ శంకర్ దర్శకత్వం వహించబోయే సినిమాలకు కాకుండా, మరో సినిమా చేయబోయే విధంగా కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అభిమానించే వారిలో విజయేంద్రప్రసాద్ ఒకరు. బాహుబలి ఇంటర్వెల్ సీక్వెల్ ను పవన్ కళ్యాణ్ ను దృష్టిలో పెట్టుకొని తయారు చేసినట్లు స్వయంగా విజయేంద్రప్రసాద్ ఓ సందర్భంలో తెలియజేశారు. ఇకపోతే ప్రస్తుతం ఏకంగా పవన్ కళ్యాణ్ కు కథ రాయడంతో ఏ విధంగా కథ సిద్ధం చేస్తారో ఎదురు చూడాల్సిందే. ఏదిఏమైనా ఈ సారి పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేయడంతో పవన్ అభిమానులకు పండగ అని చెప్పవచ్చు.