భారత్ లో లంచాల వ్యవస్థ గురించి తెలిసిందే. చేయి తడపందే ఏ పనీ కాదని ప్రజల్లో ఓ నమ్మకం ఉండిపోయింది. లంచాల వ్యవస్థపై సినిమాలు అనేకం వచ్చాయి. 1969లో వచ్చిన బుద్దిమంతుడు సినిమాలో లంచాన్ని ‘ఆమ్యామ్యా..’ అనే పేరుతో అల్లు రామలింగయ్య ఓ ట్రెండ్ సెట్ చేశారు. అంతగా లంచాల వ్యవస్థ భారత్ లో పాతుకుపోయింది. శంకర్ భారతీయుడులో ఇతర దేశాల్లో కర్తవ్యం మీరినందుకు లంచం.. భారత్ లో ‘కర్తవ్య నిర్వహణకు లంచం’ అనే డైలాగ్ ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి ఠాగూర్ కూడా లంచాల వ్యవస్థపై ఎక్కుపెట్టిన అస్త్రమే. ఎన్ని చేసినా.. ఎంత చేసినా భారత్ లో లంచాన్ని రూపుమాపడం కష్టమే. ఈ విషయాన్నే ఇప్పుడు దర్శకుడు పూరి జగన్నాధ్ తన పూరి మ్యూజింగ్స్ లో చెప్పుకొచ్చాడు.
ఇంట్లో పిల్లాడితోనే లంచం మొదలు..
‘పదేళ్ల కొడుకుని కూరగాయలు, సరుకులు తెమ్మంటే ‘నాకేంటి..’ అంటాడు. మురిసిపోతూ ఐస్ క్రీమ్, పానీ పూరికి డబ్బులిస్తుంది. ఇలా లంచానికి అక్కడే పునాది పడుతుంది. ఆ వెధవే పెద్దయ్యాక ఆఫీసర్ అవుతాడు. మనందరి సరదా తీర్చేస్తాడు. కన్నతల్లినే వదలని వాడు మనల్ని ఎందుకు వదులుతాడు. పవర్ వల్ల లంచం కాదు.. ఎవడి చేతిలో పవర్ ఉంటుందో వాడి వద్దే లంచం మొదలైపోతుంది. అందుకే ఇంట్లో పిల్లలు పవర్, పొజిషన్ గురించి ఆలోచన మొదలుపెడతాడు. పెద్దపెద్ద పోస్టులే అవసరం లేదు.. చెక్ పోస్ట్ దగ్గర స్టాంప్ వేసే డ్యూటీ దొరికినా కుమ్మేస్తాడు’ అని లంచం ప్రారంభం గురించి చెప్పుకొచ్చాడు.
ప్రతి సంతకం, ఓటు వెనుకా లంచమే..
‘భారత్ లో ప్రతి సంతకం వెనుక అవినీతి, ప్రతి ఓటు వెనుక లంచం ఉంటుంది. నిజాయితీగా ఉన్నవాడు చేతకానివాడిగా మిగిలిపోతాడు.. ఇంట్లోని వారితోనే ఎగతాళికి గురవుతాడు. అవినీతి చేసేవాడు మగాడు అవుతున్నాడు. చనిపోయే ముందు అనవసరంగా నిజాయితీపరుడిగా మిగిలిపోయాను అనుకుంటాడు. అవినీతి రంగు ఎరుపు.. అది మన రక్తంలో కలిసిపోయింది. ఎవరన్నా అవినీతి చేసారని తెలిస్తే ఆవేశంతో ఊగిపోయేవాడ్ని.. అదే పోస్టులో కూర్చోపెడితే అంతకంటే ఎక్కువ చేస్తాడు. దేవుడికి మొక్కే మొక్కులో కూడా దేవుడికి లంచం ఇస్తాం’ అని లంచం, అవినీతి చేయని వారు ఎవరూ లేరంటూ చెప్పాడు. ఆలోచన రేకెత్తిస్తున్న పూరి మాటలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.