‘సినిమా..’ ప్రతి వ్యక్తి జీవితంతో ముడిపడింది ఇదొక్కటే. ఎందుకంటే.. రోజువారీ ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం పొందేది సినిమాతోనే. ఇంతటి క్రేజ్ ఉన్న సినిమా ఎనిమిది నెలలుగా కరోనా మహమ్మారి వల్ల మూగబోయింది. ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఇప్పుడు ధియేటర్లు తెరుచుకుంటున్నాయి. మళ్లీ ప్రేక్షకులు ధియేటర్లకు రావాలి.. సినిమాలు చూడాలి.. కేరింతలు కొట్టాలి.. అనే ఆలోచనతో కన్నడ సీమలో షూట్ చేసిన ఓ చిన్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అయింది. ఈ వీడియోను డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాధ్ షేర్ చేసి తన అనుభవాన్ని చెప్పుకున్నారు. ఈ ట్వీట్ ఆసక్తి రేకెత్తిస్తోంది.
‘ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగడం లేదు. మళ్లీ ఆ రోజులు రావాలి. విజిల్స్ వేయాలి. పేపర్స్ ఎగరాలి. చొక్కాలు చిరగాలి. సినిమా ధియేటర్.. మన అమ్మ’ అంటూ పూరి కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఈ వీడియోలో మూసేసిన ధియేటర్ ను మళ్లీ తెరుస్తూండటం చూపించారు. దుమ్ము, చెట్ల నుంచి రాలిన ఆకులు, పోస్టర్ వాల్ ను శుభ్రం చేయడం.. మళ్లీ ధియేటర్ యజమాని ధియేటర్ వైపు ఆశగా చూడటం.., ధియేటర్లో సీట్లను ఆప్యాయంగా తాకడం, తెర వైపు చూడటం.. వంటి భావోద్వేగ సన్నివేశాలతో రెండున్నర నిముషాల వీడియో షూట్ చేశారు. ధియేటర్ ఎంట్రీలో శానిటైజర్ ఉంచడం.. ఓ ప్రేక్షకుడు టికెట్ కొనుక్కొని, శానిటైజర్ రాసుకుని ధియేటర్లోకి అడుగుపెట్టడం, ప్రేక్షకులు రావడం.. హౌస్ ఫుల్ బోర్డు పెట్టడం భావోద్వేగంగా ఉన్నాయి.
కన్నడ లాంగ్వేజ్ లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఉన్న ఈ వీడియోను పూరి షేర్ చేశారు. వీడియోలో కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తన సందేశం వినిపించారు. కళాకారులకు ఆశలు, దర్శకుల విజన్, నిర్మాతల పెట్టుబడి, టెక్నీషియన్ల ఆశలు.. అన్నీ ‘సినిమా’తోనే ముడిపడి ఉన్నాయి. ధియేటర్లకు రండి.. సినిమాను ఆదరించండి అంటూ పలువురు నటీనటులు తమ సందేశం వినిపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో బాగా వైరల్ అయింది.