Radhe shyam: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం `రాధేశ్యామ్`. కె.రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, టీ-సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీదాలు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో కృష్ణం రాజు, జగపతి బాబు, భాగ్యశ్రీ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్గా విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తుండడంతో.. పలు రాష్ట్రాలు మళ్లీ ఆంక్షల వలయలంలోకి వెళ్లిపోయాయి. దీంతో మేకర్స్ రాధేశ్యామ్ రిలీజ్ను వాయిదా వేశారు. అయితే మార్చి నాటికి కరోనా ప్రభావం తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాధేశ్యామ్ చిత్రాన్ని మార్చ్ 17న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు ఊపందుకున్నాయి.
మరి ఈ వార్తలే నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్కి ఇది గుడ్న్యూసే అవుతుంది. కాగా, వింటేజ్ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య అనే హస్తసాముద్రిక నిపుణుడి పాత్రలో కనిపించబోతుండగా.. ఆయన ప్రేయసి ప్రేరణగా పూజా హెగ్డే అలరించబోతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ వంటివి సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రియులందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.