ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి తనయుడు శ్రీ సింహా హీరోగా నటిస్తోన్న చిత్రం ‘మత్తు వదలరా’. కీరవాణి మరో తనయుడు కాలభైరవ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. రితేష్ రానా దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మాతలు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ “మా కుటుంబానికి చెందిన ఇద్దరు ఈ చిత్రంతో పరిచయ కావడం ఎంతో ఎమోషన్గా వుంది. ఈ సినిమా చూశాను. తీపి, కారం ఒకేసారి తిన్నట్లు అనిపించింది. చూస్తున్న కొద్ది సినిమా ఎంతో నచ్చేసింది. ప్రతి ఫ్రేమ్ నన్ను ఆకట్టుకుంది. ఇక జనాలకు నచ్చాలి. సింహా,కాలభైరవకు చక్కటి భవిష్యత్తు వుంది. ఈ నెల 25న ప్రేక్షకులతో కలిసి మరోసారి ఈ సినిమా చూస్తాను” అన్నారు. ఎం.ఎం.కీరవాణి మాట్లాడుతూ “మా పిల్లల్ని నేను ఎప్పుడూ తిడుతూ ఎంకరైజ్ చేస్తుంటాను. ప్రతి దాంట్లో తప్పులు వెతుకుతుంటాను.కానీ ఇప్పుడు నా తనయులను చూస్తుంటే గర్వంగా వుంది. రితేష్ చిత్రాన్ని చక్కగా రూపొందించాడు. ఈ సినిమా అందరికి మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాను” అన్నారు. కాలభైరవ మాట్లాడుతూ “ఎప్పటి నుంచో సంగీత దర్శకుడిని కావాలనేది నా డ్రీమ్. ఈ సినిమాతో నా కల తీరింది. నేను నా సోదరుడు ఒకేసినిమాతో పరిచయం కావడం మ్యాజిక్లా అనిపిస్తుంది. రీరికార్డింగ్లో సినిమా చూస్తున్నప్పుడు తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం కలిగింది” అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ “దర్శకుడు కథ చెప్పగానే నచ్చింది. రంగస్థలం షూటింగ్లో బిజీగా వుండటం వల్ల ఈ సినిమా పట్టాలెక్కడం ఆలస్యమైంది. తప్పకుండా చిత్రం చూసిన వాళ్లంతా కొత్తదనంతో కూడిన థ్రిల్ల్ను ఫీలవుతారు” అన్నారు. శ్రీసింహా మాట్లాడుతూ “అందరూ కొత్తవాళ్లం కలిసి నిర్మించిన సినిమా ఇది. మాపై నమ్మకం వుంచిన నిర్మాతలకు కృతజ్ఞతలు” అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ “ఈ సినిమాలో పాటలు, హీరో, హీరోయిన్స్, రొమాన్స్ లేకున్నా నిర్మాత కథ నచ్చి, కథలో ఎటువంటి మార్పు లేకుండా నిర్మించారు” అన్నారు.
previous post