తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. రాజకీయాల్లోకి వచ్చేశారు. డిసెంబర్ 31వ తేదీన ఆయన తన రాజకీయ ప్రస్థానంపై కీలక ప్రకటన చేయనున్నారు. పార్టీ పేరు, కార్యాచరణ ప్రకటించనున్నారు. ఈ ప్రకటనతో రజినీ అభిమానుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. రెండు దశాబ్దాల నాటి వారి కల నెరవేరబోతోందనే సంతోషంలో ఉన్నారు. అయితే.. సినిమాల పరిస్థితి.. ముఖ్యంగా షూటింగ్ దశలో ఉన్న ‘అన్నాతే’ పరిస్థితిపై ఎవరికీ క్లారిటీ లేదు. పొలిటికల్ ఎంట్రీ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభిస్తారా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ వార్తలకు క్లారిటీ వచ్చింది.
ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అన్నాతే కోసం రజినీకాంత్ హైదరాబాద్ వచ్చారు. స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్ లో ఆయన బేగంపేట విమానాశ్రయంలో దిగిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. దీంతో అన్నాతే షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేయబోతున్నారని తెలుస్తోంది. సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న నయనతార కూడా హైదరాబాద్ చార్టెట్ ఫ్లైట్ లోనే వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈరోజు షూటింగ్ ప్రారంభమైందని తెలుస్తోంది. షూటింగ్ స్పాట్ లో రజినీకాంత్, నయనతార కూర్చుని మాట్లాడుకుంటున్న ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
హైదరాబాద్ వస్తూనే తన బర్త్ డే కేక్ ను ఫ్లైట్ లోనే కట్ చేశారు రజినీకాంత్. కొన్ని రోజుల పాటు రజినీ హైదరాబాద్ లోనే ఉంటారని.. మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకుంటారని తెలుస్తోంది. ఆ తర్వాత 31న పొలిటికల్ పార్టీ ప్రకటనతో బిజీ అవుతారని తెలుస్తోంది. బ్యాలెన్స్ షూటింగ్ కూడా త్వరితగతిన పూర్తి చేస్తారని తెలుస్తోంది. మరి.. సినిమాను తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందే విడుదల చేస్తారా.. లేక ఎన్నికల అనంతరమా అనేది తెలియాల్సి ఉంది. తెలుగులో శంఖం, దరువు సినిమాలను తెరకెక్కించిన శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.