AP ticket price issue:ఏపీ సినిమా టికెట్ ధరల విషయంపై గత కొద్ది రోజుల నుంచీ కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల జగన్ సర్కారు సినిమా టికెట్ ధరలను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని టాలీవుడ్ ప్రముఖులు జీర్ణించుకోలేకపోయారు. దాంతో ఈ విషయంపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తూ వివాదంగా మార్చేశారు. టాలీవుడ్ దర్శకుడు, నిర్మాత రామ్ గోపాల్ వర్మ సైతం ఈ అంశంపై పూర్తి ఫోకస్ చేశారు.
సినిమా టికెట్ల ధరను తగ్గించే హక్కు ప్రభుత్వానికి లేదంటూ ఏపీ ప్రభుత్వాన్ని ఏకిపారేశారు. చివరకు తనకు అపాయింట్ మెంట్ ఇస్తే ఇండస్ట్రీ తరపున అన్ని విషయాలను వివరిస్తానని సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిని కోరగా.. ఆయన నేడు మీటింగ్కు ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో వర్మ ఈ రోజు పేర్నినానితో భేటీ అయ్యారు. అమరావతి సచివాలయంలోని మినిస్టర్ ఛాంబర్ లో దాదాపు రెండు గంటలకు పైగా జరిగిన ఈ సమావేశం కొద్ది సేపటి క్రితమే ముగిసింది. అయితే వీరి భేటీకి కన్క్లూజన్ ఏంటా అని అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్న తరుణంలో.. వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆయన మాట్లాడుతూ.. `సమావేశంలో ఐదు అంశాలపై ప్రధానంగా చర్చించాం. టికెట్ రేట్లు తగ్గించడాన్ని వ్యతిరేకించాను. ఇలా చేయడం వల్ల చాలా నష్టం వస్తుందని ఆయనకు వివరించా. సినిమా తీసిన వాళ్లకే టికెట్ రేటు నిర్ణయించుకునే అధికారం ఇవ్వాలి. సినీ నిర్మాతగా నా అభిప్రాయం చెప్పాను. కేవలం నా వెర్షన్ వినిపించేందుకు మాత్రమే ఇక్కడకు వచ్చా. తుది నిర్ణయం నా చేతిలో ఉండదు కదా.. ఫైనల్ డెసిషన్ ప్రభుత్వమే తీసుకుంటుంది. అయితే ఈరోజు చర్చలతో వంద శాతం సంతృప్తితో ఉన్నాను` అంటూ వర్మ చెప్పుకొచ్చారు. ఈయన వ్యాఖ్యల బట్టీ చూస్తుంటే పేర్ని నానితో సమావేశం సజావుగానే సాగిందని అర్థమవుతోంది. మరి ఈ ఇష్యూకు ఏపీ సర్కార్ ఎప్పుడు పులిస్టాప్ పెడుతుందో చూడాలి.