నందమూరి బాలకృష్ణ, క్రిష్ కలయికలో వచ్చిన మొదటి సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి సూపర్ హిట్ అవ్వడంతో, ఈ కాంబినేషన్ లో వస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ కూడా అదే రేంజ్ హిట్ అవుతుందని, భారీ బాక్సాఫీస్ రికార్డ్స్ సృష్టిస్తుందని ఎవరికి వారు లెక్కలు వేసుకుంటే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు టాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచి ఇండస్ట్రీ వర్గాలకే షాక్ ఇచ్చింది.
నందమూరి తారక రామారావు జీవితాన్ని తెరపై చూపించి హిట్ అందుకోవాలని చూసిన బాలయ్యని గట్టి దెబ్బ కొట్టిన కథానాయకుడు సినిమా బయ్యర్లని కూడా నిండా ముంచింది. దాదాపు 72కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిన కథానాయకుడు సినిమా బాక్సాఫీస్ దగ్గర పాతిక కోట్లు కూడా రాబట్టలేక చతికల పడింది. దీంతో సినిమాని కొన్న బయ్యర్లకి భారీ నష్టాలు వచ్చాయి.
ఈ ఎఫెక్ట్ ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాపైనే పడుతుందని భావించిన బాలకృష్ణ, పార్ట్ 2ని నష్టపోయిన వారికి ఫ్రీగా థియేట్రికల్ రైట్స్ ఇస్తున్నాడని, వారి నష్టాలు పూడ్చాలని, ఇంకా సరిగ్గా చెప్పాలంటే ఎన్టీఆర్ ఇమేజ్ కి చెడ్డ పేరు రాకూడదనే బాలయ్య ఇలా చేశాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ట్రేడ్ వర్గాలు చెప్తున్న లెక్కల ప్రకారం ఎన్టీఆర్ బయోపిక్ లోని రెండు పార్టులకి కలిపే 72 కోట్ల బిజినెస్ జరిగిందని, మొదటి సినిమా పోయినా రెండో పార్ట్ తో పెట్టిన డబ్బు రాబట్టొచ్చని ముందుగా అలోచించి రెండు పార్టులని ఒకేసారి అమ్మేశారు. ఈ విషయం తెలియని చాలా మంది బాలయ్య, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాని నష్టపోయిన వారికి ఫ్రీగా ఇస్తున్నాడని అనుకుంటున్నారు కానీ మహానాయకుడు ఫ్రీ అనే కాన్సెప్ట్ వెనకున్న అసలు నిజం ఇదే.