మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తనయుడు రితేష్ దేశ్ముఖ్, జెనీలియా దంపతులు వరద బాధితులకు 25 లక్షల రూపాయల విరాళాన్ని ఇవ్వడం ద్వారా తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. గత కొన్ని రోజులుగా దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర రాజధాని ముంబై మహానగరం సహా పలు ప్రాంతాలు జలాశయాలుగా మారాయి. కనీస అవసరాల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలను ఆదుకోవడానికి మిలటరీ సహకారంతో ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
ఇలాంటి తరుణంలో రితేష్ దేశ్ముఖ్, జెనీలియా దంపతులు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను కలిసి వరద బాధితుల కోసం తమ వంతుగా రూ.25లక్షల చెక్ను సీఎం సహానిధికి విరాళంగా అందించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలియజేస్తూ జెనీలియా, రితేష్లతో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశారు. “దేశంలో కురుస్తోన్న భారీ వర్షాలు కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పొటోలు, వీడియోలు చూసి నేను, జెనీలియా చలించిపోయాం. మా వంతుగా రూ.25 లక్షలు విరాళమిచ్చాం. వరదల్లో చిక్కుకున్న ప్రజలకు మన వంతుగా సాయం చేద్దాం. మనమంతా కలిస్తే ఏదైనా సాధించవచ్చు“ అంటూ రితేష్, జెనీలియా దంపతులు అందరికీ విన్నపం చేశారు.
previous post
next post