దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి తర్వాత తెరకెక్కిస్తున్న సినిమా ‘ట్రిపుల్ ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మొదటిసారి కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. డీవీవీ దానయ్య నిర్మాణంలో 300 కోట్ల బడ్జట్ తో రూపొందుతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ సంక్రాంతి సెలవలు అయిపోయాక చిత్ర యూనిట్ సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ని మొదలుపెట్టింది.
ఫస్ట్ షెడ్యూల్ ని చరణ్-తారక్ కాంబినేషన్ లోని ఫైట్ సీన్ తో కంప్లీట్ చేసిన రాజమౌళి, తాజా షెడ్యూల్ లో ఎన్టీఆర్ కి రెస్ట్ ఇచ్చి రామ్ చరణ్ తో మాత్రమే ఒక యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నాడు. రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న ఈ లేటెస్ట్ షెడ్యూల్ లో చరణ్ పోలీస్ ఆఫీసర్ గా ఒక్కడే వందమందితో పోరాడుతున్నాడట. ప్రీ-ఇండిపెండెన్స్ నేపథ్యంలో జరుగుతున్న కథ కాబట్టి అప్పటి పరిస్థితులకి తగ్గట్లు వేసిన సెట్ లో చరణ్ చిన్న సైజు యుద్ధమే చేస్తున్నాడు. మరి మగధీర సినిమాలో వందమంది ఫైట్ సీన్ ఆ సినిమాకే హైలైట్ అయ్యింది. అదే స్థాయిలో ఈ ట్రిపుల్ ఆర్ ఫైట్ కూడా ఉంటుందేమో చూడాలి.