Samantha: మయోసైటిస్ అనే జరగకాల కండరాల వ్యాధితో సమంత బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ కండరాల వ్యాధితో బాధపడుతున్నట్లు స్వయంగా ఇంస్టాగ్రామ్ లో అక్టోబర్ నెలలో సమంత ప్రకటించడం సంచలనం రేపింది. సమంతకి ఈ అరుదైన వ్యాధి రావడం పై ఆమె అభిమానులు ఇంకా సినీ పరిశ్రమ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఆమె నటించిన “యశోద” సినిమా ఈ నెల 11వ తారీకు విడుదల కానున్న నేపథ్యంలో యాంకర్ సుమకి ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది.
ఈ ఇంటర్వ్యూలో మయోసైటిస్ అనే వ్యాధి ప్రపంచంలో చాలామంది ఎదుర్కొన్నారని తెలిపారు. తాను కూడా ఎదుర్కొంటున్నట్లు ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లు స్పష్టం చేశారు. ఇదే సమయంలో కొద్దిగా కంటనీరు పెట్టుకుంటూ.. ఖచ్చితంగా త్వరలో దీని నుండి బయట పడతానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో తాను ఇంకా చావలేదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం చాలా కఠినమైన సమయం తన జీవితంలో నడుస్తుందని.. ఏదీ కూడా మన నియంత్రణలో ఉండదని పేర్కొన్నారు. అందరి జీవితాల్లో మంచి రోజులు మరియు చెడ్డ రోజులు ఉంటాయని సామ్ స్పష్టం చేసింది.
అయితే ఒక్కోసారి ముందుకు వెళ్లలేని పరిస్థితులు కనిపిస్తాయి. కానీ గత జీవితం గమనిస్తే జీవితంలో చాలా సాధించి ముందుకు వచ్చాను అని అనిపిస్తుంది. కాబట్టి కచ్చితంగా నేను పోరాడతాను గెలుస్తాను.. అనే నమ్మకం ఉంది అని సమంత చెప్పుకొచ్చింది. నా హెల్త్ కండిషన్ పై రకరకాల ఆర్టికల్స్ చూశాను. జీవితం ఏదో ముగిసిపోయింది అన్న రీతిలో ఉన్నాయి. కానీ నేను ఉన్న స్టేజిలో ఇది పెద్ద ప్రమాదం ఏమీ కాదు.. ప్రస్తుతానికైతే నేను చావలేదు అని సమంత ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.