తెలుగులో బాణంలా దూసుకొచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. విజయ్ దేవరకొండతో తెరకెక్కించిన ‘అర్జున్ రెడ్డి’ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిన విషయమే. హిందీలో షాహిద్ కపూర్ తో ‘కబీర్ సింగ్’ పేరుతో అర్జున్ రెడ్డిని రీమేక్ చేశాడు. అక్కడ కూడా ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ అయింది. దీంతో సందీప రెడ్డి పేరు మరింత మోగిపోయింది. ఈ సినిమాల తర్వాత సందీప్ రెడ్డి ఎవరితో సినిమా చేస్తాడో అనే ఊహాగానాలు బాగానే వచ్చాయి. పలువురు టాలీవుడ్ స్టార్ హీరోల పేర్లూ వినిపించాయి. ఇప్పుడు లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం సందీప్ రెడ్డి మళ్లీ బాలీవుడ్ లోనే సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది.
బాలీవుడ్ సమాచారం ప్రకారం రణబీర్ కపూర్ తో సందీప్ రెడ్డి తన తర్వాతి సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు ‘యానిమల్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. గ్యాంగ్ స్టర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని అంటున్నారు. కథ విన్న రణబీర్ కపూర్ సినిమా చేయడానికి అంగీకరించాడని తెలుస్తోంది. నిజానికి ఈ సినిమాకు టైటిల్ గా ‘డెవిల్’ అనే పేరును అనుకున్నాడట సందీప్ రెడ్డి. అయితే.. ఈ టైటిల్ ను సల్మాన్ ఖాన్ తో కిక్ 2 తీసేందుకు సాజిద్ నడియాద్ వాలా రిజిస్టర్ చేసుకున్నాడట. టైటిల్ ఇచ్చేందుకు సాజిద్ నిరాకరించడంతో ‘యానిమల్’ అనే పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇందుకు రణబీర్ కూడా అంగీకరించాడని అంటున్నారు.
ప్రస్తుతం రణబీర్ బ్రహ్మాస్త్ర, షంషేరా.. సినిమాలు చేస్తున్నాడు. ఈ కమిట్ మెంట్స్ పూర్తయ్యాకే ‘యానిమల్’ సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తోంది. 2021 మే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ వెళ్తుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈలోపు పూర్తి స్క్రిప్టు పనులు పూర్తవుతాయని అంటున్నారు. ప్రస్తుతానికి ఈ వార్త బీటౌన్ లో వైరల్ అవుతోంది. నటీనటులు, టెక్నీనీషియన్ల వివరాలు త్వరలో వెల్లడిస్తారని అంటున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ న్యూస్ పై పూర్తి అఫీషియల్ న్యూస్ రివీల్ కావాల్సి ఉంది.