Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర జోరుగా సాగుతోంది. పాదయాత్రలో భాగంగా అన్ని వర్గాల ప్రజలతో భేటీ అవుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ… ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇదే సమయంలో పార్టీ కార్యకర్తల నుండి ప్రజల నుండి పలు సూచనలు సలహాలు కూడా తీసుకుంటున్నారు. ప్రస్తుతం తిరుపతి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ ఉన్నారు. పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతి అంకుర ఆసుపత్రి సమీపంలో అలో లోకేష్ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువతీ యువకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా యువత అడిగిన ప్రశ్నలకు లోకేష్ ఆసక్తికరమైన సమాధానాలు ఇవ్వటం జరిగింది.
ఈ క్రమంలో తాను మొట్టమొదటిసారి దేవన్ష్ పుట్టిన సమయంలో… కన్నీరు పెట్టుకున్నట్లు ఆనంద భాష్పాలు వచ్చినట్లు.. తెలియజేశారు. అంతేకాదు తాను స్వతహాగా సినిమాల విషయంలో మెగాస్టార్ చిరంజీవి అభిమానిని అని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఇటీవలే వాల్తేరు వీరయ్య సినిమా కూడా చూసినట్లు చెప్పుకొచ్చారు. అయితే ఎంతైనా బాలయ్య తన ముద్దుల మామయ్య అని… ఆయన పట్ల ప్రత్యేకమైన అభిమానం ఉంటుందని పేర్కొన్నారు. ఇదే సమయంలో బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోపై పొగడ్తల వర్షం కురిపించారు. బాలకృష్ణ సినిమా విడుదల అయితే మొదటి షో… చూడాల్సిందే అని చెప్పుకొచ్చారు. ఇంకా ఇదే సమయంలో తాను గతంలో కంటే ఇప్పుడు ఫిట్ గా ఉండటానికి ప్రధాన కారణం… భార్య బ్రాహ్మణి అని తెలిపారు. కరోనా సమయంలో రెండు సంవత్సరాలపాటు రన్నింగ్ చేయించడం మాత్రమే కాదు.. తన డైట్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుందని వివరించారు.
ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్న సమయంలో కూడా తాను తినే ఆహారం అంతా కూడా బ్రాహ్మణికీ తెలిసిపోతుందని పేర్కొన్నారు. నా విజయాల వెనుక ఆమె ప్రధాన కారణం అందుకు గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు. ఇంకా ఇదే సమయంలో పాదయాత్ర ముగిసిన అనంతరం కాళ్లు చల్లనీటిలో పెట్టుకుని… పార్టీ నాయకులతో ఆరోజు జరిగిన విషయాలు చర్చించడం జరుగుతుంది. ఇంకా తన టీం తో పాటు స్థానిక నేతలతో ఉల్లాసంగా గడిపి అనంతరం ఫ్రెండ్స్ అనే టీవీ సీరిస్ చూడడం జరుగుతుంది అని పేర్కొన్నారు. తాను కాలేజీలో చదువుకునే రోజుల్లో ఆ టీవీ సీరిస్ ఎంతో ప్రజాధరణ పొందిందని లోకేష్ సరికొత్త విషయాలు తెలియజేశారు.