తమిళ నిర్మాతల మండలిని ప్రభుత్వం తన ఆధీనంలోకి తెచ్చుకుంది. నిర్మాతల మండలిలో జరుగుతున్న అవకతవకలు, ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ ఎన్నికలకు ముందు చేసిన వాగ్ధానాలను నెరవేర్చకపోవడం వంటి కారణాలతో మండలిని ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంది. నటుడు విశాల్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నిర్మాతల మండలికి చెందిన నిధిలో రూ.7 కోట్లు ఖర్చు చేశారని, దానికి సరైన వివరాలను చూపడం లేదని మండలి సభ్యులు పలువురు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై నటుడు కే.రాజన్, ఎస్వీ.శేఖర్, ఏఎల్.అళగప్పన్ పలువురు సభ్యులు మండలి కార్యాలయం ముందు ఆందోళన చేసి కార్యాలయానికి తాళం వేశారు. ఈ వ్యవహారం పోలీసు కేసులతోపాటు కోర్టు వరకు వెళ్లింది. అదే విధంగా మండలికి చెందిన ఆదాయ, వ్యయ వివరాలను సర్వసభ్య సమావేశంలో ఆమోదం పొందలేదని పలువురు సభ్యులు ఆరోపిస్తున్నారు. నిర్మాతల మండలిని ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకున్న విషయాన్ని మండలి రిజిస్టార్ తెలిపారు. కాగా నిర్మాతల మండలి పర్యవేక్షకుడిగా ఎన్.శేఖర్ని ప్రభుత్వం నియమించింది. ఇకపై మండలిలో ఏ కార్యక్రమాలు చేపట్టాలన్నా ఆయన ద్వారానే జరగాల్సి ఉంటుంది. ఇది మండలి అధ్యక్షుడు విశాల్కు ఘోర అవమానమే అవుతుంది. దీంతో మండలిలో వ్యతిరేక వర్గం ఇప్పటి వరకూ విశాల్ వర్గంపై చేస్తున్న ఆరోపణలు వాస్తవమేననే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
previous post
next post