Sharwanand: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ నటించిన తాజా చిత్రం `ఆడవాళ్లు మీకు జోహార్లు`. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. సీనియర్ హీరోయిన్లు రాధిక, ఖుష్బూ, ఊర్వశి కీలక పాత్రలను పోషించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ జోరుగా ప్రమోషన్స్ కూడా నిర్వహిస్తోంది. కానీ, ఇంతలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన `భీమ్లా నాయక్` చిత్రాన్ని ఫిబ్రవరి 25నే రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
దీంతో `ఆడవాళ్లు మీకు జోహార్లు` సినిమా వాయిదా పడనుందంటూ ప్రచారం మొదలైంది. కానీ బరిలో ఎవరున్నా తగ్గేదే లే అంటున్నారు శర్వానంద్. అంతేకాదు, ముందుగా ప్రకటించిన తేదీనే తమ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు శర్వా సోషల్ మీడియా ద్వారా మరోసారి ధృవీకరించాడు. ఈ మేరకు ఓ పోస్టర్ను కూడా వదిలాడు.
దీంతో శర్వానంద్ ధైర్యం ఏంటీ..? అంటూ సినీ ప్రియులు ఆశ్చర్యపోతున్నారు. భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న వస్తుంది అని చెప్పిన తర్వాత కూడా ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్ర యూనిట్ వెనక్కి తగ్గకపోవడంతో.. శర్వా మూవీపై మరిన్ని అంచనాలు పెరిగాయి.