Shriya: గత నాలుగేళ్ల నుంచి సినీ ప్రియులను ఊరిస్తూ ఊరిస్తూ వచ్చిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రం `ఆర్ఆర్ఆర్`.. ఎట్టకేలకు మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డివివి దానయ్య నిర్మించారు.
ఇందులో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించగా.. అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రియా శరణ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. విడుదలైన తొలి రోజే సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకున్న ఈ చిత్రంపై తాజాగా శ్రియా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆర్ఆర్ఆర్ లో అజయ్ దేవగణ్కు భార్యగా సరోజిని పాత్రలో నటించి మెప్పించిన శ్రియా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. `ఛత్రపతి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో చేసిన చిత్రమే ఆర్ఆర్ఆర్. ఈ సినిమా నుంచి పిలుపు రాగానే ఓకే అనేశా. సినిమా కథేంటి, నా పాత్ర ఏంటి, ఎవరెవరు నటిస్తున్నారు? ఇవేమి అడగలేదు. షూటింగ్ సెట్లో అడుగుపెట్టాకే ఇందులో చరణ్, తారక్ హీరోలని తెలిసింది. ఇందులో నాది చిన్న పాత్రే అయిన బావుంది.
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఈ సిమాకు వస్తున్న స్పందన చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది` అంటూ చెప్పుకొచ్చింది. ఇంకా మాట్లాడుతూ.. `నేనింకా ఆర్ఆర్ఆర్ చూడలేదు. రిలీజ్ సమయంలో నేను ముంబైలో ఉన్నాను. అక్కడ టిక్కెట్లు దొరకలేదు. షూటింగ్ కోసం ఇప్పుడు బెంగళూరు వచ్చాను. ఇక్కడ కూడా టిక్కెట్లు దొరకడం లేదు. ప్రతి థియేటర్స్లో హౌస్ఫుల్ బోర్డులే కనిపించాయి. కనీసం వచ్చే వారమైనా టిక్కెట్లు దొరుకుతాయేమో చూడాలి` అంటూ పేర్కొంది. మొత్తానికి ఆర్ఆర్ఆర్ టిక్కెట్లు దొరక్క శ్రియా పాపం బాగా ఇబ్బంది పడుతుందని అర్థమైంది. కాగా, ప్రస్తుతం శ్రియా `కబ్జా`, ‘దృశ్యం’ హిందీ రీమేక్ చిత్రాల్లో నటిస్తోంది.