తెలుగు ప్రేక్షకులకు సిద్ధార్థ్ పేరు చెబితే… ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’, ‘ఆట’, ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సినిమాలు గుర్తొస్తాయి. సిద్ధార్థ్ నటుడిగా మాత్రమే కాదు… గాయకుడిగానూ తెలుగు ప్రేక్షకులను అలరించారు. ‘బొమ్మరిల్లు’లో ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో…’, ‘ఓయ్’ సినిమాలో ‘176 బీచ్ హౌస్ లో ప్రేమదేవత’, ‘ఆట’ సినిమాలో ‘నిన్ను చూస్తుంటే’ పాటలను పాడింది సిద్ధార్థే. చాలా రోజుల తరవాత ఈ హీరో మరో తెలుగు పాట పాడారు. ఆయన కోసం కాదు. సందీప్ కిషన్ కోసం!
సందీప్ కిషన్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న సినిమా ‘నిను వీడని నీడను నేనే’. అన్యా సింగ్ హీరోయిన్. కార్తీక్ రాజు దర్శకుడు. ఏకే ఎంట్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర సమర్పణలో వెంకటాద్రి టాకీస్ (ప్రొడక్షన్ నంబర్ 1), వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్రహ్మణ్యన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ఒక రొమాంటిక్ సాంగ్ ‘ఎక్స్క్యూజ్ మీ రాక్షసి …’ను సిద్ధార్థ్ పాడారు. ఇటీవల సాంగ్ రికార్డింగ్ పూర్తయింది. ఈ పాటకు సామ్రాట్ సాహిత్యం అందించారు.