అప్పుడెప్పుడో మంచి మిత్రులు సినిమాలో కృష్ణ-శోభన్ బాబు పాట.. ‘ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఈనాడే ఎదురవుతుంటే..’ అనే పాట ఎంతో పాపులర్. ఇద్దరు స్నేహితులు ఒకరికొకరు కలుసుకునే సందర్భంలో వస్తుందీ పాట. ప్రస్తుతం టాలీవుడ్ తోపాటు ప్రేక్షకులు ఉన్న సందర్భం ఈ పాటనే తలపిస్తోంది. కారణం.. మరికొన్ని గంటల్లో సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘సోలోబ్రతుకే సోబెటర్’ సినిమా ధియేటర్లో రిలీజ్ అవుతోంది. కరోనా కల్లోలం తర్వాత ధియేటర్లు ఓపెన్ అయిన తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా కాబట్టి సహజంగానే ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. బుకింగ్స్ కూడా స్పీడ్ గా ఉన్నాయని తెలుస్తోంది. దీంతో సినీ ప్రముఖులు ఈ సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, మహేశ్, ప్రభాస్, రవితేజ, వరుణ్ తేజ్, విజయ్ దేవరకొండ, నాని, మంచు మనోజ్, అక్కినేని అఖిల్, శర్వానంద్, మంచు విష్ణు, రామ్, దేవిశ్రీ ప్రసాద్, తమన్, బండ్ల గణేశ్, డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్, సితార ఎంటర్ టైన్మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్, అన్నపూర్ణ స్టూడియోస్, ఏకే ఎంటర్ టైన్మెంట్స్, మెహర్ రమేశ్, బాబీ, వెంకీ అట్లూరి, బీవీఎస్ రవి.. ఇలా ఇండస్ట్రీ మొత్తం రేపటి కోసం ఎదురు చూస్తోంది. అందరిదీ ఒకటే మాట.. ‘మళ్లీ ధియేటర్లో సినిమా చూస్తున్నామనే ఆనందంలో ఉన్నాం. మళ్లీ మంచి రోజులు వచ్చేసాయి. ప్రేక్షకులు అందరూ ధియేటర్లోనే సినిమా చూడండి.. సినిమాను ప్రోత్సహించండి. మాస్కులు పెట్టుకోండి.. భౌతికదూరం పాటించండి. సినిమాను ఎంజాయ్ చేయండి..’ అని సోషల్ మీడియాను హోరెత్తించారు.
ఇందులో భాగంగా హీరో సాయిధరమ్ తేజ్ కూడా ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి ధ్యాంక్స్ చెప్తూ.. ప్రేక్షకులు తగిన జాగ్రత్తలతో సినిమా చూడాలని కోరాడు. ప్రస్తుత పరిస్థితి టాలీవుడ్ లో కాస్త టెన్షన్ ఉన్నా.. ఒక కొత్త సినిమా డైరక్ట్ రిలీజ్ అవుతూ మిగిలిని సినిమాలకు దారి చూపించబోతోంది. ప్రేక్షకులు కూడా ధియేటర్ ఎక్స్ పీరియన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఫలితం కంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకులు ధియేటర్లకు రావడంపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాబట్టి ‘సోలోబ్రతుకే సో బెటర్’ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పాల్సిందే.