సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ గా, స్టైల్ కి నాలుగు దశాబ్దాలు కేరాఫ్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన తలైవా రజినీకాంత్ సంక్రాంతికి పేట సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. తమిళనాట మంచి విజయం సాధించిన ఈ సినిమా తెలుగులో భారీ పోటీ మధ్య విడుదలైనా పర్వాలేదనిపించింది. పేట సినిమాతో పాత రజినీకాంత్ ని గుర్తు చేసిన సూపర్ స్టార్ రజినీకాంత్, మరోసారి బాక్సాఫీస్ దగ్గ్గర సందడి చేయబోతున్నాడు. అదేంటి రజినీకాంత్ పేట రిలీజ్ అయ్యి నెలన్నరే కదా అయ్యింది, అప్పుడే మరో సినిమాని ఎలా విడుదల చేస్తున్నాడు అనుకుంటున్నారా? రజినీ రిలీజ్ చేయబోయే ఆ సినిమా ‘రోబో 2.0’. దాదాపు 500కోట్ల బడ్జట్ తో భారీ వీఎఫ్ఎక్స్ వర్క్ తో శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇండియాలో 850కోట్లకి పైగా వసూళ్లని రాబట్టింది. కోలీవుడ్ బాక్సాఫీస్ హిస్టరీనీ తిరగరాసిన రోబో 2.0 సినిమా తెలుగులో మాత్రం నష్టాలనే మిగిలించింది.
ఇప్పుడు ఇదే సినిమాని చైనాలో భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసిన లైకా సంస్థ ప్రమోషన్స్ ని మొదలు పెట్టింది. అయితే ఇండియాలో రోబో 2.0గా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా చైనాలో “బాలీవుడ్ రోబో 2.0-రీసర్జెన్సెన్స్” అనే పేరుతో విడుదల కానుంది. దాదాపు 2000 స్క్రీన్స్ లో చైనావ్యాప్తంగా మే 2019లో విడుదల కానున్న ఈ సినిమా అక్కడి బాక్సాఫీస్ దగ్గర మరో 150కోట్లు రాబట్టినా కూడా రోబో 2.0 సినిమా పెట్టిన పెట్టుబడి వెనక్కి తెచ్చినట్లే. గత కొంత కాలంగా చైనాలో మన సినిమాలు బాగానే ఆడుతున్నాయి కాబట్టి రోబో 2.0 మూవీ అక్కడ మంచి విజయాన్నే అందుకునే అవకాశం ఉంది.