ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా ఏంటి అనే కన్ఫ్యూజన్ కు ఆచార్య తెర దించింది. దీని తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా కన్ఫర్మ్ అయ్యిందనే వార్తలూ వస్తున్నాయి. అయితే.. ఈమధ్య బాగా వైరల్ అయిన వార్త తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడని. కానీ.. దీనిపై ఎక్కడా ఎటువంటి క్లారిటీ రాలేదు. అందరూ ఈ వార్తను ఓ సినీ గాసిప్ అనే అనుకున్నారు. కానీ.. ఈ వార్త నిజమే అని తెలుస్తోంది. గత ఏడాది కార్తీతో ఖైదీ.. వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన లోకేశ్ కనగరాజ్ రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నాడనేది ఓ వీడియో సారాంశం.
ఓ తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేశ్ ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.. ఎంతవరకూ నిజం? అనే ప్రశ్నకు.. ‘అవును.. రామ్ చరణ్ కు కథ లైన్ చెప్పాను. ఆయనకు నచ్చింది. అయితే.. ప్రస్తుతం ఇద్దరం ఎవరి కమిట్ మెంట్స్ తో వారు బిజీగా ఉన్నాం. నేను మాస్టర్ తర్వాత విక్రమ్ తో సినిమా కమిట్ అయి ఉన్నాను. ప్రస్తుతం ఆ సినిమా పనిలో ఉన్నాను. ఈ సినిమా పూర్తవ్వగానే రామ్ చరణ్ కు ఫుల్ స్క్రిప్ట్ వినిపించి సినిమా చేస్తాం’ అని చెప్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీంతో రామ్ చరణ్ – లోకేశ్ కనగరాజ్ కాంబో సినిమా ఖాయమనే అంటున్నారు.
అయితే.. లోకేశ్ కనగరాజ్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయడం.. ఆయన విక్రమ్ తో సినిమా.. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్, ఆచార్య, గౌతమ్ తిన్ననూరి (కన్ఫర్మ్ కావాల్సి ఉంది) సినిమాలు పూర్తయ్యాకే వీరి కాంబోలో సినిమా ఉండే అవకాశం ఉందని చెప్పాలి. ఈ న్యూస్ మెగా ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చేదే. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ న్యూస్ పై పూర్తి అఫిషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ప్రస్తుతం లోకేశ్.. తమిళ్ లో విజయ్ తో మాస్టర్ సినిమా చేశాడు. ఈ సంక్రాంతికి ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది.