తెలుగు.. తమిళ.. హిందీ.. భాషలలో గడిచిన గత నాలుగైదేళ్ళలో బయోపిక్స్ సిల్వర్ స్క్రీన్ మీదకి వచ్చి భారీ విజయాలను అందుకున్నాయి. అంతేకాదు ఈ బయోపిక్స్ ని నిర్మించడానికి దర్శక నిర్మాతలు ఎంతగా ఆసక్తి చూపిస్తున్నారో వాటిలో నటించడానికి హీరో, హీరోయిన్స్ కూడా అంతే పోటీ పడుతున్నారు. ఇక ఈ సినిమాలని పాన్ ఇండియా లెవల్లో నిర్మించేందుకు భారీ బడ్జెట్ ని కేటాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ, సినీ, క్రీడలు సహా పలు రంగాల్లో అత్యున్నత సేవలు అందించిన పలువురి జీవిత చరిత్రలు వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు.
చెప్పాలంటే కమర్షియల్ సినిమాల కంటే బయోపిక్స్ ని చూడటానికే ప్రేక్షకులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ సినిమాలకే ఆదరణ ఎక్కువగా లభిస్తోంది. ఇక ఇప్పటికే బాలీవుడ్ లో సూపర్ 30, పాడ్ మాన్, దంగల్, తెలుగులో మహానటి, ఎన్.టి.ఆర్ బయోపిక్, వంగవీటి, జార్జి రెడ్డి వంటి సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హిందీలో సైనా నెహ్వాల్, కపీల్ దేవ్ బయోపిక్, అలాగే తమిళంలో అమ్మ జయలలిత బయోపిక్స్ రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలో 2000లో జరిగిన ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కాంస్య పతకం సాధించడమే కాకుండా ఒలింపిక్స్లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డ్ క్రియేట్ చేసిన కరణం మల్లేశ్వరి జీవితాన్ని సినిమాగా రూపొందించబోతున్నారు కోన వెంకట్.
రీసెంట్ గా ఈ సినిమాని అధికారకంగా ప్రకటించారు. రాజుగాడు సినిమాతో దర్శకురాలిగా మారిన సంజనా రెడ్డి దర్శకత్వంలో కరణం మల్లేశ్వరి బయోపిక్ను పాన్ ఇండియా సినిమాగా ప్రముఖ నిర్మాణ సంస్థలు ఎం.వి.వి.సినిమా, కె.ఎఫ్.సి బ్యానర్స్పై ఎం.వి.వి.సత్యనారాయణ, కోనవెంకట్ నిర్మిస్తున్నారు. ఇక కరణం మల్లీశ్వరి సినిమాని తెలుగు హిందీలలో రూపొందిస్తుండగా ఈ పాత్ర లో తాప్సీ నటించే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. ప్రస్తుతం తాప్సీ బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ మంచి ఫాం లో ఉంది. అంతేకాదు తాప్సీ కి తెలుగులోను క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.