TFI vs AP Government: సినీ పరిశ్రమ విషయంలో సీఎం జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా సామాన్యుల్లో కొంత ఊరట కనిపిస్తుంది. సినిమా టికెట్ ధరలు తగ్గాయి.. ఒకప్పుడు ఒక చిన్న ఫామిలీ సినిమాకు వెళ్తే రూ. 1000 ఖర్చయ్యేది.. ఇప్పుడు రూ. 600 సరిపోతుంది.. ఇదంతా టికెట్ ధరలను ప్రభుత్వం నియంత్రించిన పుణ్యమే… కాకపోతే దీని వలన పరిశ్రమకు చిక్కులొస్తున్నాయి. హీరోల ఓపెనింగ్ వ్యామోహంలో.., సినిమా స్థాయిని పెంచాలని కోరికో.. కానీ తెలుగులో భారీ బడ్జెట్ సినిమాలు భారీగా వస్తున్నాయి. ఈ ప్రభుత్వ నిర్ణయాల ఫలితంగా ఆ భారీ బడ్జెట్ సినిమాలకు చిక్కులు తప్పడం లేదు. తాజాగా ఈరోజు “ఆంధ్రప్రదేశ్ సినిమాస్(రెగ్యులేషన్ – అమైండ్ మెంటు) బిల్లు-2021” ను రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడారు.
TFI vs AP Government: మంత్రి కీలక వ్యాఖ్యలు..!!
బిల్లు ప్రవేశ పెడుతున్న సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. “”పేద, మధ్యతరగతి వర్గాలకు, కష్టపడే కష్టజీవులకు ప్రధాన వినోదాత్మకం సినిమా మాధ్యమం. దురదృష్టవశాత్తూ ప్రస్తుత పోకడల్లో సినిమా పట్ల పేద, మధ్యతరగతి వర్గాలకు ఉన్న ఆపేక్ష, ప్రేమను కొంతమంది సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ నిర్దేశిత విధివిధానాలను పట్టించుకోవడం లేదు. థియేటర్లలో రోజుకు నాలుగు ఆటలు మాత్రమే వేయాలని చట్టం చెబుతున్నా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. థియేటర్లలో తెల్లవారుజాము నుంచే సినిమా షోలు వేయటం, ఒక్కొక్క వీక్షకుడి నుంచి ఇష్టారాజ్యంగా మూడు వందలు నుంచి ఐదు వందలు వరకు వసూలు చేసి, పేద, మధ్యతరగతి వర్గాల ఇష్టాన్ని సొమ్ము చేసుకోవటం జరుగుతోంది. రోజుకు నాలుగు ఆటలు ప్రదర్శించాల్సిన సినిమా థియేటర్లో లెక్కకు మిక్కిలిగా ఆరు, ఏడు షోలు ప్రదర్శిస్తున్నారు. సినిమా పరిశ్రమలో మాకు ఎదురు ఉండకూడదు. సినిమా పరిశ్రమలో మేం ఏమి చేసినా చట్టాలు ఆపజాలవు… అనే రీతిలో పోకడలు చూస్తున్నాము. పేద, మధ్యతరగతి వర్గాలకు ప్రధాన వినోదంగా ఉన్న సినిమా టిక్కెట్ల రేట్లు ప్రజలకు అందుబాటులోకి తెచ్చి, ప్రేక్షకుల బలహీనతను సొమ్ము చేసుకునే అవకాశం ఇవ్వకుండా కట్టడి చేయటానికి ప్రభుత్వం ఆన్లైన్ విధానం ద్వారా టిక్కెట్ల వ్యవస్థ తీసుకురావాలని నిర్ణయించింది.” ” ఉదాహరణకు బస్సు టిక్కెట్ను ఆన్ లైన్ లో ఎలా బుక్ చేసుకుంటున్నామో.. అలాగే సినిమా టిక్కెట్లను కూడా మొబైల్, ఆన్లైన్ ద్వారా, థియేటర్లో గంట ముందు బుక్ చేసే అవకాశం ఉంది. తద్వారా సినిమా థియోటర్లలో షోలు కూడా ఎవరిష్టం వచ్చినట్లు వారు కాకుండా.. ప్రభుత్వం నిర్దేశించిన సమయాల ప్రకారం షోలు ప్రదర్శించాలి. ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడే సినిమా పరిశ్రమ నడుచుకోవాలి తప్ప ఇష్టారాజ్యంగా నడిచే అవకాశం ఉండదు.
- ప్రజలకు మేలైన, మెరుగైన సౌకర్యాలు కల్పించటం కోసం, ఇంటి వద్ద నుంచి ఫోన్లోనే ప్రభుత్వం నిర్ణయించిన రేటుకే సినిమా టిక్కెట్లు లభ్యమవటానికి సినిమాటోగ్రఫీ చట్టంలో మార్పులు తీసుకురావాలనుకున్నాం. దీనివల్ల ఆన్లైన్ సౌలభ్యం అందుబాటులోకి వస్తుంది. “అదొక్కటే కాకుండా.. చాలా చోట్ల సినిమా కలెక్షన్లు కానీ, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు చెప్పిన మొత్తాలకు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన జీఎస్టీతో పోల్చి చూసినా ఎక్కడా పొంతన కనపడటం లేదు. ఆన్లైన్ సిస్టం పెడితే.. ప్రభుత్వానికి వచ్చే పన్నులు పోర్టల్లో తెలుస్తాయి. ప్రజలకు టిక్కెట్ కూడా సరసమైన రేటుకే లభ్యమవుతుంది. ప్రభుత్వానికి రావాల్సిన పన్నులు కూడా ఎటువంటి పొరపాట్లకు అవకాశం లేకుండా వస్తాయి. ఈ విషయంలో ప్రభుత్వంపై బురద చల్లటానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు. సినిమా వారు, సినిమా థియేటర్ల యజమానులో, డిస్ట్రిబ్యూటర్లో విమర్శలు చేస్తున్నారంటే ఓ అర్థముంటుంది. కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసిన నిర్మాతలు నిందలేస్తే దానికి ఓ అర్థముంటుంది. కానీ ఓ రాజకీయ పార్టీ, వారికి అనుకూలంగా ఉండే, లోపాయికారీ సంబంధాలు నడిపే కొన్ని పార్టీలు, పత్రికలు, టీవీ ఛానల్స్.. ప్రభుత్వం మీద, ఆన్లైన్ టిక్కెటింగ్ విధానంపై బురద వేయటం చూస్తుంటే.. ఎంత దుర్మార్గంగా ప్రస్తుత రాజకీయాలు నడుస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు..!” ఫిలిం డెవలప్ మెంటు కార్పొరేషన్ అనే ప్రభుత్వ సంస్థ ద్వారా ప్రభుత్వం ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానాన్ని నిర్వహిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం రుణాల కోసమే.. ఈ విధానం తీసుకొస్తుందనే పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టాలి. అత్యంత పారదర్శకంగా, ప్రజలకు అందుబాటు ధరలకు సినిమా వినోదాన్ని అందించేందుకే ప్రభుత్వం ఈ విధానాన్ని తెచ్చింది. సినీ అభిమానుల జేబులు గుల్ల చేయకుండా, వారిని దోచుకోకుండా సినిమా చూసే అవకాశం కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. థియేటర్ దాకా వెళ్ళి, టిక్కెట్ దొరుకుతుందో, లేదో తెలియకుండా, టిక్కెట్ దొరికిన తర్వాతే.. ఓ నమ్మకంతో సినిమా చూసే అవకాశం ఈ విధానం ద్వారా కలుగుతుంది” అంటూ కొన్ని ఘాటు కామెంట్లు చేసారు.
ఈ సినిమాలకు ఇక కష్టమే..!?
తెలుగులో ఇప్పటికే భారీ బడ్జెట్ సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. డిసెంబర్, జనవరి మొదలుకుని ఏప్రిల్ వరకు కీలకమైన సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. అఖండ, పుష్ప, ఆచార్య, రాధే శ్యాం, ఆర్ ఆర్ ఆర్, భీమ్లా నాయక్, పుష్ప 2, సర్కారు వారి పాత వంటి పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ సగటున రూ. 150 కోట్లు వరకు బడ్జెట్ పెట్టిన సినిమాలే.. ఆర్ ఆర్ ఆర్ కి రూ. 400 కోట్లు వరకు పెట్టారు.. రాధే శ్యామ్ కి సుమారుగా రూ. 350 కోట్లకు పైగా పెట్టారు. పుష్ప రెండు భాగాలూ కలిపి రూ. 250 కోట్లు.., భీమ్లా నాయక్ కి రూ. 120 కోట్లు.., సర్కారు వారి పాటకి సుమారుగా రూ. 140 కోట్లు, ఆచార్య కి రూ. 150 కోట్లు.. వరకు పెట్టారు. అంటే రానున్న నాలుగైదు నెలల్లో రూ. 1500 కోట్లకు పైగా సినిమాలు రానున్నాయి. ఇవన్నీ కలిపి కనీసం 2 వేల కోట్లు వసూలు చేస్తేనే వాటికి ఉపయోగం. లేకపోతే నిర్మాతలు అడ్డంగా దొరికిపోతారు.. రాధే శ్యామ్, ఆర్ ఆర్ ఆర్ వంటి సినిమాలు ఎంత ఇతర భాషలపై ఆధారపడుతున్న.. తెలుగులోనే పెద్ద మార్కెట్ ఉంటుంది. తాజాగా ప్రభుత్వ నిర్ణయం కారణంగా ఇబ్బందులు తప్పకపోవచ్చు..!