తెలుగు రాష్ట్రాల్లోని ధియేటర్ల వ్యవస్థ, పరిస్థితులపై వెలుగులోకి వచ్చిన అంశం ధియేటర్ల ‘కిల్’ అంశం. ప్రస్తుతం తెలుగు సినిమా వెలుగుతోంది. తెలుగు సినిమాలు దాదాపు పాన్ ఇండియా కథలతో తెరకెక్కుతున్నాయి. బాలీవుడ్ తర్వాత మేమే అని కాస్త కాలర్ ఎగరేసిన కోలివుడ్ ను మాట్లాడకుండా చేస్తోంది టాలీవుడ్. దశాబ్దాలుగా దేశంలో ఏడాదికి ఎక్కువ సినిమాలు నిర్మించేది తెలుగు సినీ పరిశ్రమే అయినా ఉమ్మడిగా ఉండి ఉనికిని చాటుకోలేకపోయింది టాలీవుడ్. ఇప్పుడు తెలుగు సినిమా మాట్లాడుతోంది. భారతీయ చిత్ర పరిశ్రమ అంతా.. తెలుగు నుంచి ఏస్థాయి సినిమా వస్తుందో అని ఎదురుచూసేంతగా ఎదిగింది. ఇదంతా పైకి కనిపించేదేనా..? మేడి పండు చందమేనా..? లోలోపల అంతర్గతం వేరేనా..? అంటే పరిస్థితులు అవుననే సమాధానాలు కల్పిస్తున్నాయి. రీసెంట్ గా టాలీవుడ్ లో చెలరేగిన ఓ అంశం ఇందుకు ఊతమిస్తోంది. అదే.. ‘కిల్ రాజు’.
ఓపక్క ఓటీటీ గాలి దేశంలో విపరీతంగా వీస్తోంది. ప్రేక్షకులు సెల్ ఫోన్లో కూడా కొత్త సినిమాల నుంచి వెబ్ సిరీస్ లు, డాక్యుమెంటరీలు చూసేస్తున్నారు. మరి ఈ సమయంలో ధియేటర్ల పరిస్థితేంటి.. ఎలా కాపాడుకోవాలి అనే ఆలోచన అందరిలో ఉండాలి. కానీ.. అలా జరగడం లేదని ఇటివలి సంక్రాంతికి తేలి పోయింది. ధియేటర్ల సమస్యపై కొన్నేళ్లుగా ఎవరైనా ప్రస్తావించేది.. ‘ఆ నలుగురి’ గురించే. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లనును శాసిస్తోంది, ధియేటర్లను గుప్పిట్లో పెట్టుకుంది ఈ ‘నలుగురే’ అని తెర పైకి వస్తుంది. కానీ.. ఆ వెంటనే చల్లారి పోతుంది. కానీ.. ఈసారి గట్టిగా పేలింది. డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను ఈ అంశాన్ని ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి లోలోపల జరుగుతుందేంటో బయటపెట్టాడు. ఆయన ‘దిల్ రాజు కాదు కిల్ రాజు’ అంటూ సంచలనం రేపాడు. కారణం.. తెలంగాణ రీజియన్ లో రవితేజ ‘క్రాక్’ సినిమాను శ్రీను తీసుకున్నాడు. ధియేటర్లు ఇవ్వాల్సింది దిల్ రాజు. కానీ.. సూపర్ కలెక్షన్లతో మంచి ధియేటర్లలో నడుస్తున్న ‘క్రాక్’ ను పక్కన పెట్టేసి తాను కొనుక్కున్న సినిమాలను వాటిలో ప్రదర్శించడమే శ్రీను కోపానికి కారణం.
గతంలో సినిమా వస్తే పండగ. కానీ.. ప్రస్తుతం పండగ సమాయాల్లో సినిమా రావాలి. రోజులు పోయి కలెక్షన్లే ప్రామాణికమైన ప్రస్తుత పరిస్థితుల్లో పండగ సమాయాల్లో సినమా వస్తే రెవెన్యూ గట్టిగా ఉంటుంది. ధియేటర్లలో సినిమా చూసే వారు తగ్గిపోతున్న ఈ సమయంలో పండగ సమయాల్లో మాత్రం జనాలు వస్తారు. ఇందులో ముఖ్యమైంది సంక్రాంతి, వేసవి, దసరా.. ముఖ్యమైనవి. ఈ సీజన్లలో సినిమాలు విడుదలకు భారీ పోటీ ఉంటుంది. కానీ.. ప్రతి ఏటా సంక్రాంతికి తమిళ సినిమాలు రావడం మొదలెట్టాయి. ఈ ఏడాది విజయ్ నటించిన మాస్టర్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడు సమస్యంతా ఈ సినిమా చుట్టూనే తిరిగింది. హిట్ టాక్ వచ్చిన ‘క్రాక్’ ను తీసేసి మాస్టర్ సినిమా వేయడం.. అది కూడా దిల్ రాజు చేయడం శ్రీనును ఇబ్బంది పెట్టింది. మంచి ధియేటర్లలో ఫ్లాప్ సినిమా వేసి బలవంతంగా కలెక్షన్లు రాబట్టే ప్రయత్నంలో ఇదో భాగం అయింది. దీంతో హిట్టైన తెలుగు సినిమాను అంతగా బాలేని ధియేటర్లలో వేస్తే ప్రేక్షకులు సినిమా చూసేందుకు ఆసక్తి చూపకపోవచ్చు. ఈ పరిస్థితుల్లో ధియేటర్లు వ్యక్తుల చేతుల్లో ఉండి మంచి సినిమాకు రెవెన్యూ తెచ్చిపెట్టకపోవడం ఏంటో ఎవరికీ అర్ధం కాని పరిస్థితి. గతంలో పండగకు తమిళ రాకూడదని చెప్పిన దిల్ రాజే ఇప్పుడు మాస్టర్ సినిమాను నడిపించడం తగని పని అని అందరూ అంటున్నారు.
టాలీవుడ్ బిగ్గీస్ అల్లు అరవింద్, సురేశ్ బాబు, సునీల్, సుధాకర్ రెడ్డి, దిల్ రాజు.. ఇప్పుడీ అంశంపై చర్చించినట్టు తెలుస్తోంది. ఇకపై సినిమాలకు ధియేటర్ల సమస్య రాకుండా చూడాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు. కానీ.. మళ్లీ మామూలే అవుతుందని అనేవారు లేకపోలేదు. ధియేటర్లు ఉండి రెవెన్యూ లేక నడపలేని వారు.. ఇలా పెద్దవాళ్ల చేతుల్లో ధియేటర్లు పెట్టి రెంట్ల మీద ధియేటర్లు నడుపుతున్నారు. ఇది ఒకరకంగా ధియేటర్ల మనుగడకు మంచిదే అయినా.. వ్యక్తుల చేతుల్లో మోనోపలి మాత్రం మంచిది కాదు. ఇలా అయితే.. కొత్తగా సినిమాల్లోకి వచ్చే వరంగల్ శ్రీను వంటి వారికి అన్యాయం జరగడమే కాదు.. పరిశ్రమలో ఏకచత్రాధిపత్యం రాజ్యమేలి ప్రేక్షకులకు మంచి సినిమా కూడా దరి చేరకపోవచ్చు. మనసులో ఎన్నున్నా.. తెలుగు సినిమా వెలగాలంటే మాత్రం పరిశ్రమ ధియేటర్లను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!