అమరావతి : తెలుగు చిత్ర పరిశ్రమ విశాఖకు రానున్నదా? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మదిలో విశాఖను పరిపాలనా రాజధానితో పాటు సినీ రాజధానిగా అభివృద్ధి చేయాలని ఉన్నదా? తెలుగు సినీ రంగ ప్రముఖులు అందుకు సుముఖంగా ఉన్నారా? అనే విషయాలపై నేడు ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది. అందుకు కారణం లేకపోలేదు. చెన్నైలో తెలుగు సినీ పరిశ్రమ ఉన్నప్పుడు షూటింగ్ లకు అనువుగా ఉన్న విశాఖపై అంతా చూసేవారు. అప్పట్లో విశాఖ, భీమిలి, అరకు వంటి ప్రాంతాలలో పెద్ద ఎత్తున షూటింగ్ లు జరిగేవి. నాటి ప్రముఖ దర్శకులు కె బాలచందర్, కె విశ్వనాథ్, దాసరి నారాయణ రావు తదితరులు అనేక సినిమా అవుట్ డోర్ షూటింగ్ లను ఇక్కడ నిర్వహించారు. నాడు అవుట్ డోర్ షూటింగ్ లతో విశాఖ, అరకు, భీమిలి కిటకిట లాడింది కూడా. నాడు ఒక సెంటిమెంట్ కూడా ఉండేది. విశాఖ ప్రాంతంలో అవుట్ డోర్ షూటింగ్ లు పూర్తి చేసుకున్న ప్రతి చిత్రం హిట్ అవుతుండేదని సినీ వర్గాల టాక్. ఈ నేపథ్యంలో మద్రాస్ నుండి ఆంధ్రప్రదేశ్ కు చిత్ర పరిశ్రమ వస్తున్న సమయంలో విశాఖకు మారుతుందని అందరూ భావించారు. ఉమ్మడి ఏపి రాజధానిగా హైదరాబాద్ ఉన్నప్పటికీ విశాఖ సినీ రాజధాని అవుతుందని అందరు అనుకున్నారు కానీ రాజధాని ప్రాంతంలోనే తెలుగు సినీ పరిశ్రమ స్థిరపడింది.
2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలోనూ విశాఖకు సినీ పరిశ్రమ వస్తుందని భావించారు. అందుకు ప్రధాన కారణం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న వారిలో ఎక్కువ శాతం మంది ఆంధ్రా ప్రాంతీయులు కావడం. వీరంతా ఆంధ్రకు వస్తారని భావించినప్పటికీ నాటి ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టకపోవడంతో టాలీవుడ్ ఆరేళ్లుగా హైదరాబాద్ లోనే ఉండిపోయింది.
నేడు ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్ది విశాఖను పరిపాలనా రాజధానిగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ముందడుగులు వేస్తుండటంతో మరో మారు ఇది చర్చనీయాంశమైంది.
ఈ నెల 9వ తేదీన మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో సినీ రంగ ప్రముఖులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్దితో భేటీ కానుండటంతో విశాఖలో సినీ రంగ అభివృద్ధిపైనే చర్చ జరగనుందని భావిస్తున్నారు. సీఎం జగన్ ఆలోచనలకు అనుగుణంగా సినీ పెద్దలు నిర్ణయం తీసుకుంటే ఉత్తరాంధ్ర ప్రజలు నక్క తోకను తొక్కినట్లే. ఒక పక్క పరిపాలనా రాజధాని, మరో పక్క సినీ రాజధాని రావడం అదృష్టమే కదా!