సినిమాకో కొత్త హీరోయిన్ వస్తున్న రోజులివి. ఈ జనరేషన్ లో పదేళ్ల కెరీర్ కొనసాగించడం ఏ హీరోయిన్ కి అయినా అసాధ్యమే. కానీ.. అంతకంటే పెద్ద మ్యాజిక్ చేసింది చెన్నై బ్యూటీ త్రిష. ‘జోడి’ సినిమాలో హీరోయిన్ సిమ్రన్ కు ఫ్రెండ్స్ లో ఒకరిగా నటించింది త్రిష. తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సౌత్ ఇండియన్ ఫిమేల్ సూపర్ స్టార్ రేంజ్ కి ఎదిగింది. నేటితో త్రిష ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 18 ఏళ్లు పూర్తయ్యాయి. 2002లో తమిళంలో సూర్య హీరోగా వచ్చిన ‘మౌనం పెసియాదే’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది త్రిష. ఆ సినిమా 2002 డిసెంబర్ 13న విడుదలైంది.
2003లో నీ మనసు నాకు తెలుసు ద్వారా తెలుగులో పరిచయం అయింది. 2004లో ప్రభాస్ హీరోగా వచ్చిన ‘వర్షం’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో త్రిష వెనుదిరిగి చూడలేదు. వరుస హిట్లు ఆమె కెరీర్లో పడ్డాయి. 2005లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు.. వంటి బ్లాక్ బస్టర్లు ఆమెను స్టార్ హీరోయిన్ గా మార్చేశాయి. తమిళ సినిమాల్లో కూడా వరుసగా సామి, లేసా లేసా, ఆరు, గిల్లి, తిరుపాచ్చి.. వంటి సూపర్ హిట్స్ తో కెరీర్ అప్రతిహతంగా కొనసాగింది. చిరంజీవి, రజినీకాంత్, కమల్ హాసన్, నాగార్జున, వెంకటేశ్, పవన్ కల్యాణ్, మహేశ్, ఎన్టీఆర్, ప్రభాస్, విజయ్, అజిత్.. వంటి స్టార్ హీరోలందరితో సినిమాలు చేసింది.
తెలుగు, తమిళ సినిమాల్లో ఏకకాలంలో చేస్తూ ఓదశలో సౌత్ ఇండియా నెంబర్ వన్ హీరోయిన్ గా రాణించింది. సాటి హీరోయిన్లతో పోటీ ఉన్నా తన కెరీర్ ను తిరుగులేకుండా కొనసాగించింది. 18 ఏళ్ల కెరీర్లో హిందీ, కన్నడ సినిమాల్లో కూడా నటించింది. అందమైన ఆమె నవ్వే 1999లో మిస్ చెన్నై కిరీటం గెలిపించింది. మూగజీవాల రక్షణ కోసం ‘పెటా’ బ్రాండ్ అంబాసిడర్ గానూ పని చేసింది. ప్రస్తుతం తమిళ్ లో పొన్నియన్ సెల్వన్ సినిమా చేస్తోంది. ఈ సందర్భంగా త్రిష అభిమానులు #18YearsOfSouthQueenTRISHA అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు.