Trivikram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చివరిగా `అల వైకుంఠపురంలో` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం 2020లో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా రాలేదు. కానీ, ఫిబ్రవరి 25న విడుదలైన `భీమ్లా నాయక్`కు స్క్రీన్ ప్లే, మాటలు అందించడంతో పాటు సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్నే ఆయనే దగ్గరుండి చూసుకున్నారు.
ఇకపోతే లాంగ్ గ్యాప్ తర్వాత త్రివిక్రమ్ ఇటీవలె మహేష్ బాబుతో ఓ సినిమాను అనౌన్స్ చేశాడు. అతడు, ఖలేజాల తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న మూడో చిత్రమిది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హేగ్దే హీరోయిన్ గా నటిస్తుండగా.. తమన్ స్వరాలు సమకూర్చుతున్నారు.
త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు త్రివిక్రమ్ పుచ్చుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే కళ్లు తేలేస్తారు. ఎందుకంటే, స్టార్ హీరోతో సమానంగా ఆయన రెమ్యునరేషన్ను డిమాండ్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాలు ప్రకారం.. మహేష్ బాబు సినిమాకు త్రివిక్రమ్ ఏకంగా రూ. 50 కోట్లను పారితోషికంగా అందుకుంటున్నాడట. ఇదే కనుక నిజమైతే దర్శకధీరుడు రాజమౌళి తర్వాత ఆ రేంజ్లో భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాసే అవుతాడని అంటున్నారు.