‘అల.. వైకుంఠపురములో..’ వంటి సూపర్హిట్ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ జనవరిలోగానీ, ఫిబ్రవరిలోగానీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గతంలో బన్ని, సుకుమార్ కాంబినేషన్లో ఆర్య, ఆర్య2 వంటి సూపర్హిట్ సినిమాలు వచ్చాయి. హ్యాట్రిక్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమా కోసం కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు దర్శకుడు సుకుమార్. మన సినిమాల్లో రెగ్యులర్గా కనిపించే విలన్స్ కాకుండా కోలీవుడ్లో హీరోగా మంచి పేరు తెచ్చుకుంటున్న విజయ్ సేతుపతిని ఈ సినిమాలో విలన్గా తీసుకుంటే బాగుంటుందని సుకుమార్ భావిస్తున్నారని తెలుస్తోంది. ఆల్రెడీ ఈ సినిమా కోసం విజయ్ సేతుపతిని ఎంపిక చేయడం జరిగింది. ఓ కీలక పాత్ర అని మాత్రమే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాలో విజయ్ విలన్గా నటించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటించే ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.