NTR-Charan: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రం `ఆర్ఆర్ఆర్`. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించగా.. అజయ్ దేవగణ్, శ్రియ, సముద్రఖని, రే స్టీవెన్ సన్, అలీసన్ డూడీ కీలక పాత్రలను పోషించారు.
భారీ అంచనాల నడుమ ఈ చిత్రం మార్చి 25న వివిధ భాషల్లో విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది. టాక్ అదిరిపోవడంతో ఈ చిత్రం ఇప్పుడు భారీ కలెక్షన్లను రాబడుతూ బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేస్తుంది. ఇకపోతే ఎన్టీఆర్-చరణ్ల ఫ్యాన్స్ ఎగిరి గంతేసే గుడ్న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే.. ఆర్ఆర్ఆర్ ను చూసిన ప్రేక్షకులు దానికి కొనసాగింపుగా పార్ట్ 2 ఉంటే బాగుంటుందని ఆశ పడుతున్నారు.
అయితే వారి ఆశలకు ఉత్సాహాన్ని అందిస్తూ ఆర్ఆర్ఆర్ 2 కూడా ఉండొచ్చని ఇండియన్ స్టార్ రైటర్, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన్ను.. `ఆర్ఆర్ఆర్ కు సీక్వెల్ ఉంటుందా..?` అని యాంకర్ ప్రశ్నించారు.
అందుకు ఆయన బదులిస్తూ.. `ఈ మధ్య ఎన్టీఆర్ మా ఇంటికి వచ్చారు. అందరం ఆర్ఆర్ఆర్ సీక్వెల్ గురించి మాట్లాడుకున్నాం. నేను కొన్ని ఐడియాలను చెప్పాను. అవి ఎన్టీఆర్, రాజమౌళికి బాగా నచ్చాయి. దేవుడి దయ ఉంటే భవిష్యత్తులో ఆర్ఆర్ఆర్ 2 రావొచ్చు` అంటూ చెప్పుకొచ్చారు. విజయేంద్ర ప్రసాద్ మాటలతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.