RRR: ఈ ఏడాది మార్చి నెలలో విడుదలైన “RRR” ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ₹1000 కోట్లకు పైగా కలెక్షన్ సాధించి రికార్డులు సృష్టించింది. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా “RRR” నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన తర్వాత హాలీవుడ్ ప్రముఖుల నుండి భారీ ఎత్తున ప్రశంసలు వచ్చాయి. దర్శకుడు రాజమౌళి పనితనంపై పొగడ్తల వర్షం కురిపించారు. ఇంకా ఇద్దరు హీరోలు చరణ్, తారక్ పెర్ఫార్మెన్స్ పై కూడా పాజిటివ్ కామెంట్లు చేయడం జరిగింది.
“RRR” భారతదేశ సినీ స్థాయిని నెక్స్ట్ లెవెల్ లోకి తీసుకెళ్ళింది. ఈ సినిమా విజయం తర్వాత రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ చలనచిత్ర మహోత్సవాలకు ఆహ్వానాలు అందటం ఇందుకు నిదర్శనం. ఇదిలా ఉంటే ఇటీవల ప్రపంచవ్యాప్తంగా పలు పేరుగాంచిన మ్యాగజిన్ లలో “RRR” ఆస్కార్ అవార్డులు గెలుచుకోవడానికి రేసులో ఉన్నట్లు వార్తలు ప్రచురించడం జరిగింది. ఇటువంటి తరుణంలో తాజాగా వైసీపీ పార్టీ సీనియర్ ఎంపీ విజయసాయిరెడ్డి “RRR”కి ఆస్కార్ అవార్డుల వార్తపై సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు.
“RRR చిత్రం హాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకొంది. ఆస్కార్ బరిలో Jr.NTR, రామ్ చరణ్ ఉండొచ్చన్న హాలీవుడ్ మ్యాగజైన్ అంచనాలు మన తెలుగు చిత్ర స్థాయిని చాటిచెబుతున్నాయి. గిరిపుత్రులు బ్రిటిష్ వారిపై జరిపిన పోరాటమే ఇతివృత్తంగా సాగిన ఈ చిత్రం ఖచ్చితంగా ఆస్కార్ సాధిస్తుందని ఆశిస్తున్నా”..అని విజయసాయిరెడ్డి తన స్పందన తెలియజేశారు. ఈ సినిమాపై ఇండియా కాక ఇతర దేశాలు ప్రత్యేకంగా తమ ప్రముఖ పత్రికలలో పొగుడుతూ ఆర్టికల్స్ కూడా రాయడం జరిగింది. ఇజ్రాయిల్ వంటి శక్తివంతమైన దేశంలో ఏకంగా ఒక ఫుల్ పేజీలో ఈ సినిమా గురించి రాయటం అప్పట్లో సంచలనం సృష్టించింది. కచ్చితంగా RRR చిత్రం ఆస్కార్ గెలిచే అవకాశాలు ఉన్నట్లు సినీ విశ్లేషకులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు.