యంగ్ టైగర్ ఎన్టీఆర్ను హీరోగా తెరకెక్కించిన చిత్రం “ఆది”. తొలి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వివి. వినాయక్. ఆది సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించింది. ఈ సినిమాకు ఏకంగా నంది అవార్డు కూడా అందుకున్నారు వివి.వినాయక్. ఆ తర్వాత దిల్, చెన్నకేశరెడ్డి, ఠాగూర్, లక్ష్మీ వంటి చిత్రాలు తీసి అగ్ర దర్శకుడిగా వెలుగొందుతూ.. తెలుగు సినీ రంగానికి చెందిన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంటి సీనియర్ హీరోలతో పాటు ప్రభాస్, అల్లు అర్జున్, నితిన్ వంటి యంగ్ హీరోలతోనూ ఆయన సినిమాలు తీశారు.
ఇందంతా సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న తర్వాతి విషయం. అయితే, తెలుగు సినీ పరిశ్రమకు రాకముందు తాను అనేక ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్నానంటూ తాజాగా వివి. వినాయక్ తెలిపారు. ఓ సాధారణ కుటుంబం నుంచి వెళ్లి.. సినీ పరిశ్రమలోకి అడుగుపెడతానంటే ఇప్పటికీ ప్రతి కుటుంబంలోనూ భయాలు మొదలవుతాయి. వారి తల్లిదండ్రుల నుంచి అటువైపు వద్దనే వాదనలు వినిపిస్తాయి. ఇదే మాదిరిగా వివి. వినాయక్ కు సైతం తన కుటుంబం నుంచి ఇలాంటి అనుభవమే ఎదురైందని చెప్పారు.
వివి.వినాయక్ ముద్దు పేరు నాని.. ఇప్పటికీ తన కుటుంబ సభ్యులు అలానే పిలుస్తారని చెప్పారు. సినీ పరిశ్రమలోకి వెళ్తానంటే మొదట్లో వద్దన్నారని వెల్లడించారు. మరీ ముఖ్యంగా సినీ రంగానికి చెందిన వారికి పిల్లను ఇవ్వరనీ, ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని తన తండ్రి ఒత్తిడి తీసుకువచ్చారనీ, ఈ విషయమై తన తండ్రితో గోడవలు సైతం జరిగాయని వివరించారు. అయినప్పటికీ పదే పదే తన తండ్రి పెళ్లి ప్రస్తావన తీసుకురావటంతో.. పెళ్లి చేసుకుని ఏం పీకాలి? ఇప్పుడే పెళ్లి ఎందుకు నాకు? అంటూ తీవ్ర స్థాయిలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుందని వినాయక్ చెప్పుకొచ్చాడు.
అయితే, ఆది సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత అదే ఏడాది పెళ్లి చేసుకున్నాడు వినాయక్. కాగా, ఇటీవల ఆయన తీసిన పలు సినిమాలు ప్రేక్షకులను అంతగా అకట్టుకోకపోవడంతో.. దర్శకుడిగా బాగా వెనుకపడ్డారు. ప్రస్తుతం ఆయన “శీనయ్య” అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. అనంతరం ఓ అగ్రహీరోతో సినిమా తీయనున్నారనీ, ఇప్పటికే ఆ హీరోకు కథను వినిపించగా… ఒకే చెప్పినట్టు సినీ వర్గాల్లో టాక్ నడుస్తున్నది.