Pawan kalyan: తమిళ హీరో కోసం మన పవర్ స్టార్ వెనక్కి తగ్గడం ఏంటీ..ఫ్యాన్స్ ఊరుకుంటారా..? అవును ఇదే చర్చలు ఇప్పుడు సోషల్ మీడియాలో సాగుతున్నాయి. ఈ ఏడాది వచ్చే మోస్ట్ అవైటెడ్ సినిమాలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ భీమ్లా నాయక్. పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈ సినిమాను ఈ నెల 25వ తేదీన రిలీజ్ చేసేందుకు మేకర్స్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ సినిమా అయ్యప్పనుం కోషియం చిత్రానికి అఫీషియల్ తెలుగు రీమేక్ సినిమా కావడంతో పాటు పవన్ కళ్యాణ్, రానా హీరోలు కావడంతో భారీగానే అంచనాలున్నాయి.
ఇక ఈ సినిమాకు అన్నీ విభాగాలలో అగ్ర దర్శక, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ వెనక ఉన్న కారణంగా కూడా భీమ్లా నాయక్ సినిమా మీద భారీ రేంజ్లో అంచనాలున్నాయి. సినిమా నుంచి ఇప్పటి వరకు రిలీజైన ప్రతీది కూడా ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఊహించని విధంగా క్రేజ్ పెంచాయి. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ లాంటి క్రేజీ హీరోయిన్స్, బ్రహ్మానందం లాంటి లెజండరీ కమెడియన్స్ కీలక పాత్రల్లో కనిపించబోతుండటం అదనపు ఆకర్షణగా నిలవబోతున్నాయి. ఇక థమన్ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మరో రేంజ్ అని చెప్పక తప్పదు. ఇన్ని కలిసొచ్చే అంచనాల మధ్య భీమ్లా నాయక్ సినిమా రాబోతుండగా, ఇప్పుడు దీనికి తమిళ స్టార్ హీరో నటించిన సినిమా పోటీ రానుంది.
pawan kalyan: మరి ఇది కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమా..?
భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ అని ప్రకటించిన ఫిబ్రవరి 25వ తేదీనే కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్, టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ నటించిన వలిమై సినిమా రిలీజ్ చేస్తున్నారు. కార్తికేయ నటించాడు కాబట్టి..అలాగే గత కొంతకాలంగా అజిత్ వరుస హిట్ అందుకుంటున్న నేపథ్యంలో తెలుగులోనూ ఈ సినిమా మీద భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. దాంతో రెండు సినిమాలు ఒకేరోజు రిలీజ్ చేసే అవకాశాలు లేవంటున్నారు నెటిజన్స్. కానీ, పవన్ అభిమానులు మాత్రం తమిళ స్టార్ హీరో సినిమాకు మన పవర్ స్టార్ సినిమాను పోస్ట్ పోన్ చేయడమేంటీ ఇది ఎంతమాత్రం సబబు కాదని గట్టిగానే కామెంట్స్ చేస్తున్నారట. మరి ఇది కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమా లేక నిజమేనా అనేది తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.