తెలుగు సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి ప్రస్థానం నాలుగు దశాబ్దాలుగా అప్రతిహతంగా కొనసాగుతోంది. తెలుగు సినిమా స్థాయిని జాతీయస్థాయికి తీసుకెళ్లిన హీరోగా చిరంజీవి పేరు ప్రఖ్యాతుల గురించి తెలిసిందే. అద్భుతమైన డ్యాన్స్, ఒరిజినల్ ఫైట్స్ చేయాలంటే చిరంజీవి మాత్రమే అనేంతగా యువతను, కుటుంబ ప్రేక్షకులను దశాబ్దాల పాటు అలరించారు. స్వయంకృషితో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా మెగాస్టార్ గా ఎదిగిన హీరోగా తెలుగు సీనీ పరిశ్రమ ఆయన్ను గుర్తు పెట్టుకుంటుంది. సినిమాల్లో ఎవరెస్ట్ అంత ఎత్తున ఉన్న చిరంజీవి రాజకీయాల్లో మాత్రం ఆ స్థాయి చూడలేకపోయారు. సీఎం కావాలనుకున్న ఆయన కేంద్ర మంత్రి మాత్రం కాగలిగారు. అయితే.. చిరంజీవి మళ్లీ సీఎం కుర్చీ వైపు అడుగులేస్తారా..? మళ్లీ రాజకీయాల వైపు చూస్తారా.. లేక సినిమాలకే పరిమితం అవుతారా..? ఈ మూడు కూడళ్లలో ఆయన పయనం ఎటు..? చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని ‘న్యూస్ ఆర్బిట్’ అందిస్తున్న కథనం..
కాంగ్రెస్ ను మళ్లీ నుంచోబెట్టే అవకాశాలను కొట్టి పారేయలేం..
చిరంజీవి 2009లో ప్రజారాజ్యం పెట్టి ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. అనంతరం కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేశారు. అనంతరం రాజ్యసభకు ఎన్నికై కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో కాంగ్రెస్ చచ్చుబడిపోయింది. చిరంజీవి కూడా రాజకీయంగా స్తబ్దుగా ఉండిపోయారు. అయితే.. కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేయలేదు. దీంతో ఆయన తటస్థంగా ఉండిపోయారని చెప్పాలి. చిరంజీవి వంటి నాయకుడిని వదులుకోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉండదు. చిరంజీవి ఛరిష్మా దక్షిణాదిన తమకు ఉపయుక్తంగా ఉంటుందని భావించే చిరంజీవి తమలో కలుపుకుంది. 2024 ఎన్నికలు కాంగ్రెస్ కు కీలకం. రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ జీవం పోసుకోవాలంటే చిరంజీవిఅవసరం ఉంది. కాంగ్రెస్ పునరుజ్జీవానికి మాజీ సీఎం కిరణ్ కుమార్ తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనతోపాటు చిరంజీవి కలిసి కాంగ్రెస్ ను నిలబెడతారా అనేది తేలాల్సిన అంశం.
బీజేపీ వైపు అడుగులు వేస్తారా.. ఆహ్వానం ఉందిగా..!
మరోవైపు చిరంజీవి తమ పార్టీలోకి రావాలని బీజేపీ ఆశిస్తోంది. ఆయన చరిష్మా ద్వారా ఓట్లు కొల్లగొట్టాలని చూస్తోంది. 2024 ఎన్నికల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మెజారిటీ సీట్లు సాధించాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకు చిరంజీవి చరిష్మా పనికొస్తుందని బీజీపీ గట్టిగా నమ్ముతోంది. ఇప్పటికే పవన్ కల్యాణ్ జనసేనతో కలిసి నడుస్తోంది బీజేపీ. ఇప్పుడు చిరంజీవిని కూడా తమ పార్టీలోకి రప్పించాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే సోము వీర్రాజు చిరంజీవిని కలిశారు. బీజేపీలోకి రావాలని కూడా ఆహ్వానించారు. ఈ ప్రతిపాదనను చిరంజీవి సున్నితంగా తిరస్కరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ కు భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంది. ఈ నేపథ్యంలో చిరంజీవి రాజకీయ భవిష్యత్తు ఆశిస్తే.. తమ్ముడు పవన్ వెళ్తున్న బీజేపీ దారిలోనే వెళ్లే అవకాశం ఉంది. అదే జరిగితే.. 2024లో బీజేపీకి లాభిస్తుంది. అందుకే బీజేపీకి ఇదొక అవకాశం.
సామాజిక ఉద్యమం వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయా.. లేవా?
ఎవరు అవునన్నా కాదన్నా.. చిరంజీవి ఓ సామాజికవర్గానికి (కాపు) చెందిన వారిగా కూడా గుర్తింపు ఉంది. తెలుగు సినీ పరిశ్రమలో కమ్మ ఆధిపత్యం కొనసాగుతున్న రోజుల్లో కాపుల నుంచి చిరంజీవి అత్యంత ప్రతిభావంతుడిగా ఎదిగారు. అప్పటివరకూ ఉన్న కాపు పెద్దలు చిరంజీవిపై దృష్టి పెట్టారు. చిరంజీవి విజయంలో పరిశ్రమలోని కాపు పెద్దల పాత్ర కొట్టివేయలేం. 2009లో చిరంజీవి పార్టీ పెట్టిన సమయంలో ఆయనకు ఆర్ధిక వెన్నుదన్నుగా నిలిచింది.. రాజకీయ భరోసాగా నిలిచింది మాత్రం కాపు సామాజిక వర్గమే. వంగవీటి రంగా తర్వాత ఆస్థాయి అండ తమకు లభిస్తుందని ఆశించారు. చిరంజీవి మాత్రం సామాజిక న్యాయం అంటూ ప్రచారం చేసుకుని అన్ని వర్గాల వారిని కలుపుకుంటూ వెళ్లారు. అయితే.. చిరంజీవి తమకు బ్రాండ్ అంబాసిడర్ అని చాలామంది కాపు నాయకులు భావిస్తూ ఉంటారు. వంగవీటి రంగా తర్వాత కాపుల్ని ఏకతాటిపై నడిపించే నాయకుడు దొరకలేదు. ముద్రగడ ఉన్నా ఆయన నిలకడలేమి కాపులకు ఉపయోగపడలేదు. కాపులకు ఓ నాయకుడు కావాలని భావిస్తున్న వారికి చిరంజీవి వారికి ఆశాదీపంలా కనిపిస్తున్నారు. మరి చిరంజీవి వారి ఆశను నెరవేరుస్తారా లేదా అనేది చూడాలి. చిరంజీవి సినిమాలపరంగా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుని అందరివాడు అనిపించుకున్నారు. ఈ పరిస్థితుల్లో కాపు కులాన్ని మాత్రమే భుజాన వేసుకుని ఉద్యమాలంటూ వారిని వెనుకేసుకు వస్తారనేది అసాధ్యం. కానీ. కాపు నాయకుల ఆశల్లో అర్ధం ఉంది. అందుకే చిరంజీవికి మూడో ప్రత్యామ్నాయం జాతీయపార్టీలో చేరడం. దీని ద్వారా కాంగ్రెస్, బీజేపీల్లో ఏదొక పార్టీలో చేరి తన రాజకీయ పునర్జన్మను పొంది తన హవా కొనసాగించే అవకాశాలు ఉన్నాయి.