Yash: `కేజీఎఫ్ చాప్టర్ 1` తో బ్లాక్ బస్టర్ హిట్ను ఖాతాలో వేసుకుని పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న కన్నడ రాక్స్టార్ యశ్.. ఇప్పుడు `కేజీఎఫ్ చాప్టర్ 2`తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హొంబాలే ఫిల్మ్స్ బ్యానర్పై విజయ్ కిరగందుర్ నిర్మించారు.
ఇందులో శ్రీనిది శెట్టి హీరోయిన్గా నటించింది. అలాగే సంజయ్ దత్ విలన్గా చేశారు. గత ఏడాదే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం.. మరో మూడు రోజుల్లో అంటే ఏప్రిల్ 14న అట్టహాసంగా విడుదల అయ్యేందుకు సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ నిర్వహిస్తూ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నారు.
హీరో యశ్ కూడా చిత్ర టీమ్తో కలిసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే తాజాగా ఆయన తెలుగు మీడియాకు బహిరంగంగానే క్షమాపణలు తెలిపాడు. అసలేం జరిగిందంటే..హీరో యష్ ఈ ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అక్కడ నుండీ వైజాగ్ మీడియా సమావేశానికి బయల్దేరారు. అయితే వైజాగ్ ప్రెస్ మీట్ కి యశ్ దాదాపు గంటన్నర లేట్గా వెళ్లాడు. దాంతో మీడియా ఆయనపై అసహనం వ్యక్తం చేసింది.
అంతేకాదు, తమని గంటల పాటు ఎదురుచూసేలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని పలువురు రిపోర్టర్లు ప్రశ్నించారు. అందుకు యశ్.. గత కొన్ని రోజుల నుంచీ నేను ఎక్కడకి వెళుతున్నానో, వస్తున్నానో నాకే అర్థం కావడం లేదు. చిత్ర టీమ్ ఎక్కడికి తీసుకెళ్తే ఆ కార్యక్రమానికి హాజరు అవుతున్నా. ప్రైవేట్ ఫ్లైట్ లో తిరుగుతున్నాం. ఆలస్యం అవ్వడానికి అది కూడా ఒక కారణం. కావాలని లేట్ చేయలేదు. పది నిముషాలు కూడా విలువైనవే. మీ సమయాన్ని వృధా చేసినందుకు నన్ను క్షమించండి అంటూ యశ్ పేర్కొన్నాడు. కాగా, ఇలాంటి సంఘటనే గతంలో అల్లు అర్జున్కు బెంగుళూరులో జరిగింది. అప్పుడు ఆయన కూడా సారీ చెప్పి మీడియాను కూల్ చేశారు.