శ్రీమహావిష్ణువు అవతారమూర్తి. దుష్టశిక్షణ….శిష్ట రక్షణ కోసం ఆయన ఆయా కాలాలలో ఆయా అవతారాలను ఎత్తారు. ముఖ్యమైన వాటిలో నారసింహ అవతారం ఒకటి.
హిరణ్యకశిపుని సంహారం కోసం నరసింహుడు అవతారం దాల్చిన ప్రదేశం అహోబిలం. నరసింహ స్వామి 9 రూపాల్లో కొలువై ఈ క్షేత్రాన మహిమలను చాటుతున్నారు.కర్నూలు సిగలోని ప్రముఖ వైష్ణవ ప్రదేశం అహోబిలం. దేశంలోని నరసింహ క్షేత్రాల్లో ప్రత్యేకమైనదిగా అహోబిల క్షేత్రాన్ని పేర్కొంటారు. ఎగువ అహోబిలంలో నరసింహ స్వామిఉగ్రనరసింహుడుగా, దిగువ అహోబిలంలో ప్రహ్లాద వరద నరసింహుడుగా కొలువై ఉన్నారు. దీనితో పాటు ఈ ఆలయ పరిసరాల్లో స్వామి మొత్తం తొమ్మిది రూపాలలో కొలువై ఉన్నారు.
తొమ్మిది రూపాలు:
జ్వాలా, భార్గవ, యోగానంద, ఛత్రవట, పావన, కారంజ, క్రోడ, మాలోల, ప్రహ్లాద వరద నరసింహ స్వామిగా ఇక్కడ స్వామి దర్శనమిస్తారు.
అవతరించిన క్షేత్రం
శాప ప్రభావం వల్ల రాక్షసునిగా జన్మించిన హిరణ్యకశిపుడు అనే రాజు కుమారుడే ఈ ప్రహ్లాదుడు. హరిజపం తప్ప మరో వ్యాపకం లేకుండా గడుపుతుంటాడు ఆ బాలుడు. అయితే పరమ హరి ద్వేషి అయిన హిరణ్యకశిపునికి ఇది ఎంతమాత్రం ఇష్టం ఉండేది కాదట. అనేక సార్లు నచ్చజెప్పి చూసినా విష్ణుభజన మానకపోవడంతో కుమారుడు అన్న మమకారాన్ని సైతం మరిచి చంపేందుకు సిద్ధం అవుతాడు. చాలా సార్లు కొడుకును హతమార్చేందుకు యత్నించినా మహావిష్ణువు దయ వల్ల బయటపడతాడు ప్రహ్లాదుడు.
ప్రహ్లాదుని షయంలో హిరణ్యకశిపుని ఆగడాలు శృతిమించుతూ ఉండడంతో మహావిష్ణువు సింహం తల, మనిషి శరీరం దాల్చి నరసింహుడుగా అవతరించి ఆ రూపంలోనే హిరణ్యకశిపున్ని సంహరిస్తాడు. విష్ణువు నరసింహుడుగా మారింది అహోబిల క్షేత్రంలోనే అని అంటారు. నరసింహుడు బయల్పడిన స్తంభం కూడా ఈ ప్రదేశంలో కనిపిస్తుంది. దీన్ని ఉగ్రస్తంభంగా పేర్కొంటారు. ఈ ప్రాంతాన్నే ఎగువ అహోబిలం అని అంటారు.
నవనారసింహుడిగా ఒకే చోట కొలువైన అహోబిల క్షేత్రం దేశంలోని నరసింహ క్షేత్రాల్లోనే అత్యంత పవిత్రమైనదిగా ప్రతీతి. నరసింహుడు జనించిన ఈ ప్రాంతం మహిమలను చూపడంలోనూ అంతే రీతిగా ప్రసిద్ధి చెందింది. విధ సమస్యలతో ఈ సన్నిధికి వచ్చిన వారికి ఇక్కడి స్వామి అంతులేని మానసిక ప్రశాంతతను సిద్ధిస్తాడట.
ఐదు ప్రదిక్షణలతో
అహోబిల నరసింహ స్వామి లీలా శేషాల్లో ప్రధానమైనది మానసిక గందరగోళాన్ని దూరం చేయడంలో ఈయన చూపే మహిమలు. సమస్యలతో మనసు కలమైన వారు అహోబిల క్షేత్రాన్ని దర్శించి ఇక్కడ 5 ప్రదక్షిణలు నిర్వహిస్తే చాలా చక్కని ఫలితాలు ఉంటాయట. నరసింహుడు ఎక్కడ కొలువై ఉన్నా ఆయన లీలలకు లోటుందట.
అద్భుతమైన కళాసంపద
భారతీయ దేవాలయాలు… అద్భుత నిర్మాణ సంపదకు కేంద్రాలు. ప్రాచీన నిర్మాణ కళాచాతుర్యాన్ని సగర్వంగా చాటుతూ అలరారుతూ ఉంటుంది అహోబిల క్షేత్రం. ప్రాకారాలు, నిర్మాణాలు, గోపురాలు…. ఇలా ప్రతి అడుగులోనూ కళాత్మకత ఉట్టిపడుతూ ఈ క్షేత్రం మైమరిపిస్తుంది.భారతీయుల నిర్మాణ చాతుర్యాన్ని దశదిశలా చాటుతూ అలరారుతున్న దేవస్థానం అహోబిల క్షేత్రం. సువిశాల ప్రాంగణంలో కనిపించే ఈ ఆలయ నిర్మాణం కోసం అనేక మంది రాజులు, చక్రవర్తులు పాటుపడ్డట్లు స్థలపురాణం. కాకతీయ రాజుల్లో చివరివాడైన ప్రతాపరుద్రుడు స్వామికి బంగారు విహాలు తయారుచేయించి మంటపాలు, దేవాలయం నిర్మించినట్లు చెబుతారు. ఆలయంలో 64 స్తంభాలతో కళ్యాణ మంటపం, 82 స్తంభాలతో మరో మంటపం కనిపిస్తుంది. దీన్నే రంగమంటపం అని అంటారు. ఈ రంగమంటపాన్ని 15వ శతాబ్దంలో శ్రీ కృష్ణదేవరాయలు కట్టించారు.
రవాణ సౌకర్యం
అహోబిలం చేరుకోవడానికి విస్తృత రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. కర్నూలు జిల్లాలోని నంద్యాలకు 68 కిలోమీటర్ల దూరంలోను, ఆళ్లగడ్డకు 24 కిలోమీటర్ల దూరంలోనూ అహోబిలం నెలవై ఉంది. నంద్యాల, ఆళ్లగడ్డల నుంచి ఇక్కడికి విస్తృత రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. నవనారసింహుడు కొలువైన అహోబిల క్షేత్రాన్ని దర్శించి మీరూ పునీతులు కండి.