కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా దీని బారినపడకుండా ఉండటానికి ప్రజలు చాలా రకాల జాగ్రత్తలే తీసుకుంటున్నారు. మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, భౌతిక దూరం పాటించడం లాంటివి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా కోవిడ్-19 సృష్టించిన కల్లోలం నేపథ్యంలో శానిటైజర్స్ వాడకం భారీగా పెరిగింది. గతేడాది నుంచి శానిటైజర్లు డైలీ లైఫ్లో ఒక భాగమైపోయాయి. మనం కరోనా వైరస్ బారినపడకుండా శానిటైజర్ రక్షణ కల్పిస్తుంది సరే.. కానీ మరి మనం పెంచుకుంటున్న జంతువుల (పెట్స్) సంగతి ఏంటి?
కరోనా నేపథ్యంలో శానిటైజర్ను చేతులకు రుద్దుకుని పెంపుడు జంతువులను ముట్టుకోవడం మంచిదేనా? మనం వాడే శానిటైజర్ జంతువులకు సైతం వాడవచ్చునా? వాటిపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతోంది? ఎలా పెట్స్ కు రక్షణ కల్పించాలి? అనే ప్రశ్నలు అందరికీ సాధారణంగా వచ్చేవే. మరీ ఆ విషయాలు మీ కోసం..!
సాధారణంగా ప్రస్తుతం మార్కెట్లో లభించే హ్యండ్ శానిటైజర్లను ఆల్కాహాల్ ను ఉపయోగించి తయారు చేస్తారు. ఎందుకంటే ఆల్కాహాల్కు క్రిములను చంపే లక్షణం ఉంటుంది. అందుకే మనం వాడే శానిటైజర్లలో దాదాపు 60 శాతం నుంచి 95 శాతం వరకూ ఆల్కాహాల్ పర్సెంటేజ్ ఉంటుంది. అయితే, క్రిమి సంహారకంగా పనిచేసే శానిటైజర్లు పెంపుడు జంతువులకు చాలా హానికరమైనవని నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే మనం వాడే శానిటైజర్ల తయారీలో ఆల్కాహాల్ (ఇథనాల్)తో పాటు హైడ్రోజన్ పెరాక్సైడ్ను అధిక మొత్తంలో ఉపయోగిస్తారనీ, దీంతో పెంపుడు జంతువులపై ప్రభావం చూపుతతాయని చెబుతున్నారు.
మనం వాడే ఈ శానిటైజర్లు పెంపుడు జంతువులపై కూడా అదే రకమైన ప్రభావం చూపలేవనీ, వీటి ద్వారా పెట్స్ ప్రాణాలకు ప్రమాదం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా శానిటైజర్ల కారణంగా వాటికి ఎలర్జీ రావచ్చుననీ, వీటి కళ్ల పై కూడా తీవ్రమైన ప్రభావం చూపడంతో పాటు పెట్స్ కు అనేక ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని చెబుతున్నారు. ఇప్పటికే పెంపుడు జంతువుల కోసం అనేక రకాల శానిటైజర్లు అందుబాటులోకి వచ్చాయనీ, పెట్స్ రక్షణ కోసం వాటిని మాత్రమే వాడాలని సూచిస్తున్నారు.
ముఖ్యంగా పెట్స్ శానిటైజర్లలో తక్కువ మొత్తంలో ఉండే బెంజాల్కోనియం క్లోరైడ్ కారణంగా పెంపుడు జంతువులపై ఉండే అనేక రకాల సూక్ష్మ క్రిములను చంపేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ శానిటైజర్లు నాన్ టాక్సిక్ కావడం వల్ల పెంపుడు జంతువులకు ఎలాంటి ప్రమాదమూ సంభవించే అవకాశం లేదని చేబుతున్నారు. కాబట్టి మీరు మీ పెట్స్ కోసం తయారు చేసిన శానిటైజర్ ను కొనండి మరి..!