అధర్వణవేదం, బ్రహ్మాండ, పద్మపురాణం, మహాభారతం కూడా గో విశిష్టత తెలుపుతాయి. గోశాలలను శుభ్రం చేసి ముగ్గులు వేసి శ్రీ మహాలక్ష్మీ సమేత శ్రీ మహావిష్ణువు ప్రతిమను పద్మాలపై పెట్టి శాస్త్రోకంగా పూజచేస్తారు. మహా విష్ణువునకు అత్యంత ఇష్టమైన తులసి కోట దగ్గర పద్మం ముగ్గువేసి దీపం వెలిగించి పలురకాల పండ్లను నివేదిన చేస్తారు.
ఏకాదశి వ్రతాన్ని రుక్మాంగదుడు, అంబరీషుడు కూడా పాటించారు.వాళ్లు పాటించడమే కాక వారి రాజ్యాల్లోని జనులందరి చేతకూడా ఏకాదశి వ్రతాన్ని పాటించేలా చేశారు. ఏకాదశి వ్రతం చేసేవారిపై ఎల్లప్పుడు మహావిష్ణువు తోడునీడగా ఉంటాడు. మహా విష్ణువు నాలుగు నెలలపాటు క్షీర సముద్రంలో శేషశయ్యపైన పవళిస్తాడని ఋషులు,యోగులు మహావిష్ణువును కీర్తించడంలో తమ జీవితకాలాన్ని గడుపుతుంటారు.
దేశ సంచారులైన యతులు ఈ నాలుగు నెలలు ఒక్కచోటనే ఉండి విష్ణుకీర్తనలు చాతుర్మాస వ్రతాన్ని చేస్తుంటారు. ఏకాదశి ఉపవాసవ్రతం చేసుకున్నవారికి అశ్వమేధ యాగం చేసినంత, అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి పలు పురాణాలలో అనేక విషయాలు ఉన్నాయి.